కేసీఆర్ మారిన మనిషిలా కనిపిస్తున్నాడు. తప్పులు ఒప్పుకొంటున్నాడు. అహంకారం వీడినట్టు కనిపించడం లేదు కానీ, కార్యకర్తలు, ఉద్యమకారుల విషయంలో మాత్రం తప్పు జరిగిందని చెంప లేసుకుంటున్నాడు. పశ్చాత్తాపం ప్రకటిస్తున్నాడు. ఇకపై అలా ఉండదు. కేసీఆర్ను సీఎం చేయుర్రి.. ఇగ మొత్తం పాలన నేను చూసుకుంటా! అని అంటున్నాడు.
కార్యకర్తలకు గౌరవం దక్కకుండా చేసిన మాట వాస్తవమేనన్నాడు. ఉద్యమకారులు వారిపై గంపెడాశలు పెట్టుకుంటే వారిని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నాడు. ఈ రెండు తప్పులనే ఒప్పుకుంటున్నాడు. మిగిలిన లోపాలు, పాపాలు తెలిసినా.. బహిరంగ వేదిక మీద ప్రకటించకున్నా వారు మారితే అదే పదివేలని గులాబీ దళం భావిస్తోంది.
అయితే పరిపాలన మీద పట్టు కోసమే వీరిని పట్టించుకోలేదని సమర్థించుకున్నాడు కేటీఆర్. గురువారం చేవెళ్లలో జరిగిన పార్టీ మీటింగు హాజరై కేటీఆర్ మాట్లాడాడు. సంక్షేమ పథకాలన్నీ ఆన్లైన్ చేయడం మూలంగా.. గ్రామాల్లో కార్యకర్తలకు పనిలేకుండా పోయిందని, ప్రజలు వారిని పట్టించుకోలేదని, అంతా నేరుగా వస్తున్నప్పుడు మేముండి ఏం చేయాలని కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారని అన్నాడు కేటీఆర్. అందుకే వారి గౌరవం పెంచేలా చేస్తామన్నాడు. అధికారం వచ్చిన తరువాత ఐదేండ్లు ఇక పరిస్థితి అలా ఉండబోదన్నాడు.
అంటే.. ఆన్లైన్ సిస్టమ్ తీసేస్తాడా? ఏందీ అనే అనుమానాలు వస్తున్నాయి. కళ్యాణలక్ష్మీ చెక్కులు ఎమ్మెల్యేలు పంచినట్టు.. ప్రతినెల ఆసరా పింఛన్లు కూడా కార్యకర్తలే చెక్కుల రూపంలో అందిస్తారేమో.. ! బహుశా అన్ని ఆఫ్లైన్ చేసేసి… కార్యకర్తల చేతికిస్తాడేమో? కమీషన్లు తీసుకోవద్దనే కదా అలా చేసింది. ఇక ఇప్పుడు కమీషన్ల దందా షురూ చేసుకోమని చెప్పకనే చెబుతున్నాడు కేటీఆర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఉద్యమకారుల మీదా సానుభూతి కురిపించాడు కేటీఆర్. వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ వారిని పట్టించుకోలేదన్నాడు కేటీఆర్. ఇకపై అలా చేయబోమని, ప్రభుత్వ పదవులు, పార్టీ పదవుల ద్వారా న్యాయం చేస్తామని మాటిచ్చాడు. ఈ రెండు విషయాలు తప్ప అతని ప్రసంగం అంతటా ఒకేలా ఉంటుంది. తమను ఓడగొట్టినందుకు మాకేం నష్టం లేదనే విధంగానే మాట్లాడుతున్నాడు కేటీఆర్.
ఊర్లల్లో జనాలకు బీఆరెస్ను ఓడగొట్టుకున్నందుకు ఇజ్జత్ అనిపిస్తుందట! జనాల మనసులో ఏముందో కేటీఆర్ చెప్పుకుంటున్నాడు ఇలా వేదికల మీద. అంటే ఇక బుద్దొచ్చింది కదా! ఇకనైనా మారుతారా? మాకే ఓటేస్తారా? అని ఇలా బహిరంగ వేదికల మీద జనం మీద దాడి చేసినట్టుగానే ఆయన ప్రసంగ సారాంశం ఉంటుంది. పీఎం తప్ప కేసీఆర్ అన్ని పదవులు చేపట్టారని చెబుతున్నారు. ఆ పీఎం అనే పదం పదేపదే కేటీఆర్ నోటి వెంట వస్తే.. .. కేసీఆర్ను మళ్లీ ఢిల్లీకి పంపాలనే ఆలోచన ఉందేమోనని ఆ ఫామ్హౌజ్లనే కూర్చోబెడతారేమో జనం.. జర జాగ్రత్త కేటీఆర్!