Maoists Warning To BRS Leaders : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్తుల లేఖ కలకలం సృష్టిస్తోంది. స్థానిక బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇస్తూ మావోలు విడుదల చేసిన లేఖ గురించి తీవ్ర చర్చ నడుస్తోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన దళిత బంధును అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నేతలు పేదల దగ్గర డబ్బులు వసూలు చేశారని ఆరోపించిన మావోయిస్టులు.. ఇప్పుడు ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చేయాలని హెచ్చిరించారు. భారత కమ్యునిష్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖ బయటకు వచ్చింది.
గతంలో దళిత బంధు పేరుతో పేదలను తీవ్రంగా మోసం చేసారంటూ లేఖలో ఆరోపించిన మావోయిస్టులు.. అమాయకులను దళిత బంధు ఆశ చూపించి డబ్బులు దన్నుకున్నారంటూ ఆగ్రహించారు. డబ్బులు తీసుకుని సైతం ఇప్పటి వరకు వారికి ఎలాంటి లబ్ధి కలిగించలేదని.. పేదల దగ్గర వసూలు చేసిన డబ్బుల్ని తిరిగి ఇవ్వకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని బీఆర్ఎస్ నేతలకు మావోయిస్టులు వార్నిగ్ ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కీలక బీఆర్ఎస్ నేతలైన మాజీ జెడ్పీటీసీ రాజిరెడ్డి, రామగౌడ్, మండలాధ్యక్షులు బెల్లంకొండ కిష్టయ్య, కాటారం ఎంపీటీసీ తోట జనార్థన్, మాజీ జెడ్పీ ఛైర్మన్ బద్దం రాకేష్, భూపల్లి రాజు సహా మహదేవ్ పూర్ మండలానికి సంబంధించిన మరికొంత మంది బీఆర్ఎస్ నేతల పేర్లను ఈ లేఖలో మావోయిస్టులు ప్రస్తావించారు. వీరంతా అక్రమంగా పేదల దగ్గర డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. లేఖలో బీఆర్ఎస్ నేతలతో పాటు ఇద్దరు కాంగ్రెస్ నేతల పేర్లు ప్రస్తావించారు.
దళిత బంధు పథకంలో ఒకేసారి పది లక్షల రూపాయలు మేర ఆర్థిక సహాయం అందుతుండడంతో చాలా మంది పేదలు స్థానిక నేతలకు వారు అడిగినంత ఇచ్చారని మావోలు తెలిపారు. చాలా మంది వారి ఆర్థిక స్థోమతకు మంచి డబ్బుల్ని ముట్టజెప్పారని.. ఇప్పుడు వారికి వాటిని తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధును ఆశగా చూపించి ఒక్కో కుటుంబం దగ్గర ఈ నేతలు ఏకంగా రూ.2 లక్షల మేర వసూళ్లకు పాల్పడినట్లు తెలిపిన మావోయిస్టులు.. అక్రమంగా వసూలు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. ఈ బెదిరింపు లేఖపై స్పందించేందుకు సంబంధిత నాయకులు నిరాకరించారు.
Also Read : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. సీఎం రేవంత్ ఫ్యామిలీ
మావోయిస్టుల పేరుతో లేఖ విడుదల కావడంతో జిల్లాలో ఈ ఘటన గురించే ఎక్కువగా చర్చ నడుస్తోంది. అయితే.. ఈ లేఖను నిజంగానే మావోయిస్టులు విడుదల చేశారా..? లేదా, బాధితుల్లోనే ఎవరైనా వారి డబ్బులు తిరిగి రాబట్టుకునేందుకు ఇలా చేసారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మావోయిస్టుల లేఖతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీనిపై పూర్తి విచారణ ప్రారంభించారు. ఇదే విషయమై రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు అనేక సార్లు విమర్శలు చేశారు. దళిత బంధు పేరులో బీఆర్ఎస్ నాయకులు, వారి అనుచరులే లబ్ధి పొందుతున్నారని, నిజమైన లబ్ధిదారులకు పథకం అందడం లేదని ఆరోపణలు చేశారు.