Medaram Hundi Firstday Income(Telangana news): మేడారం ఆలయం హుండీ లెక్కింపు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో హుండీ లెక్కింపును చేపట్టారు. మొదటి రోజు లెక్కింపు పూర్తవ్వగా.. 518 హుండీలకు గాను ఇప్పటి వరకు 134 హుండీలలో కానుకలను అధికారులు లెక్కించారు. తొలిరోజు లెక్కింపులో 3 కోట్ల 15 లక్షల 40 వేల రూపాయల ఆదాయం ఆలయానికి వచ్చింది. ఈ మొత్తాన్ని ఎండోమెంట్ అధికారులు బ్యాంకులో జమ చేశారు. కాగా.. మేడారం హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియ మొత్తం 10 రోజులు జరగనుంది. 150 మంది దేవాదాయ శాఖ సిబ్బంది, 200 మంది స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు హుండీ లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కౌంటింగ్ కొనసాగనుంది.
Read More : హైదరాబాదీలకు శుభవార్త.. ప్రాపర్టీ ట్యాక్స్ పై భారీ డిస్కౌంట్..
కాగా.. హుండీల్లోని కానుకలు లెక్కిస్తుండగా.. సిబ్బందికి నకిలీ నోట్లు కనిపించాయి. నోట్లపై గాంధీ బొమ్మకు బదులుగా అంబేద్కర్ ఫొటో దర్శనమిచ్చింది. వెంటనే అక్కడున్న దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు చెప్పగా.. వారు నోట్లను పరిశీలించారు. నోట్లు ముందు, వెనుక కూడా అంబేద్కర్ ఫొటో ఉండటంతో.. వాటిని సేకరించి భద్రపరిచారు. ఇప్పటి వరకూ 20 కి పైగా రూ.100 నోట్లు బయటపడినట్లు సమాచారం. గత జాతరలో అయితే కొందరు భక్తులు తమ కోరికలను పేపర్ పై రాసి హుండీల్లో వేయగా.. ఈసారి ఫేక్ కరెన్సీ బయటపడింది.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో.. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకూ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఘనంగా జరగ్గా.. 1.40 కోట్ల మంది భక్తులు వనదేవతల్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు అధికారులు తెలిపారు. జాతరలో సమ్మక్క గద్దెల వద్ద 215, సారలమ్మ గద్దెల సమీపంలో 215, పగిడిద్దరాజు గద్దెల వద్ద 26, గోవిందరాజు గద్దె వద్ద 26, మరో 30 క్లాత్ హుండీలను ఏర్పాటు చేశారు. తిరుగువారం నేపథ్యంలో.. సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద మరో 23 హుండీలను ఏర్పాటు చేశారు.