ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన ‘మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర’కు రంగం సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా, జాతర విశేషాలతో రూపొందించిన ప్రత్యేక బ్రోచర్, వాల్ పోస్టర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా జాతర విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంతో పాటు.. భక్తులకు అవసరమైన సమాచారాన్ని చేరవేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు పలువురు పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతర విజయవంతం కోసం తీసుకోవాల్సిన చర్యలు, భక్తులకు కల్పించాల్సిన కనీస వసతులు, భద్రతా ఏర్పాట్లపై సీఎం సమీక్షించారు. గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
నాలుగు రోజుల పాటు ఆధ్యాత్మిక వేడుక
వచ్చే ఏడాది జనవరి 28 నుంచి జనవరి 31 వరకు నాలుగు రోజుల పాటు ఈ మహా జాతర కొనసాగనుంది.
మొదటి రోజు (జనవరి 28): కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజులు మేడారంలోని గద్దెలపైకి చేరుకుంటారు. దీంతో జాతర కోలాహలం మొదలవుతుంది.
రెండో రోజు (జనవరి 29): జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం సమ్మక్క తల్లి రాక. చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని గిరిజన పూజారులు గద్దెపైకి తీసుకొస్తారు. ఈ సమయంలో భక్తులు చేసే జయజయధ్వానాలతో మేడారం మారుమోగిపోతుంది.
మూడో రోజు (జనవరి 30): ఇది భక్తులు తమ మొక్కులు తీర్చుకునే ప్రధాన రోజు. లక్షలాది మంది భక్తులు గద్దెల వద్దకు చేరుకుని అమ్మవార్లకు ‘బంగారం’ (బెల్లం) సమర్పించుకుంటారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చే రోజు ఇది.
నాలుగో రోజు (జనవరి 31): అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. సాయంత్రం సమయంలో పూజారులు సంప్రదాయబద్ధంగా అమ్మవార్లను తిరిగి వనానికి తీసుకెళ్లడంతో ఈ చారిత్రాత్మక ఉత్సవం ముగుస్తుంది.
కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి నిలయమైన మేడారం జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే భారీగా నిధులను కేటాయించింది. రవాణా, తాగునీరు, పారిశుధ్యం మరియు భద్రత విషయంలో ఎక్కడా లోటు లేకుండా గిరిజన సంక్షేమ శాఖ సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ALSO READ: CM Revanth: దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన