Medaram Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేస్తోంది. అమ్మవార్ల గద్దెల వద్ద జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక యజ్ఞంలా ఈ పనులను చేపడుతున్నారని కొనియాడారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కేవలం భవనాలు కట్టడం కాకుండా, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర భవిష్యత్ తరాలకు తెలిసేలా నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆలయ రాతి శిలల మీద ఆదివాసీల గొట్టు, గోత్రాలు, వారి జీవన శైలిని ప్రతిబింబించే శిల్పాలను చెక్కిస్తున్నామని చెప్పారు. 90 రోజుల్లోనే ఈ బృహత్తర కార్యాన్ని పూర్తి చేయాలని సంకల్పించామని, మా ఆదివాసీ విశ్వాసాలకు తగ్గట్లుగా ఆలయం రూపుదిద్దుకుంటోందన్నారు. మేడారంలో భక్తుల కోసం విశాలమైన రోడ్లను సిద్ధం చేశామని, మన ఇంటి దేవతల జాతరకు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కోరిన కోర్కెలు తీర్చే తల్లుల ఆలయాన్ని కేవలం 100 రోజుల్లోనే అద్భుతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. మరో 200 ఏళ్ల పాటు చెక్కుచెదరని విధంగా పటిష్టమైన రాతి నిర్మాణం (Stone Architecture) చేస్తున్నామని తెలిపారు. చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనా, ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని, జనవరి మొదటి వారానికల్లా మిగిలిన పనులు పూర్తి చేసి అమ్మవార్లకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రాల నుంచి నిపుణులైన అధికారుల సహాయం తీసుకుని రాత్రింబవళ్లు శ్రమిస్తున్నామని చెప్పారు.
ఒకవైపు భక్తుల దర్శనాలు కొనసాగుతుండగానే, మరోవైపు పనులు చకచకా సాగుతున్నాయని మంత్రి తెలిపారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎవరు ఎన్ని కారుకూతలు కూసినా, విమర్శలు చేసినా పట్టించుకోకుండా ముందుకెళ్తున్నామని ప్రతిపక్షాలకు చురకలంటించారు. కొత్త సంవత్సరంలో జాతరకు వచ్చే భక్తులకు ఒక కొత్త ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని హామీ ఇచ్చారు. ఈ మహా జాతరకు ప్రతిపక్ష నాయకులతో పాటు ప్రజలందరినీ ప్రభుత్వం తరపున సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు.
Read Also: BRS: కేటీఆర్ ఫెయిల్యూర్.. టార్గెట్ హరీష్ రావు, కేసీఆర్ అసలు వ్యూహం ఇదేనా..?