Caste Census Survey: తెలంగాణలో జరిగిన కులగణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం కల్పించినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ అవకాశాన్ని సర్వేలో పాల్గొనని వారు సద్వినియోగం చేసుకోవాలని, ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం పేర్లు నమోదు చేసుకోవాలని భట్టి కోరారు. కులగణనకు సంబంధించి బుధవారం భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వేను కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని కూడ సర్కార్ నిర్వహించింది. అసెంబ్లీ సాక్షిగా సర్వేకు సంబంధించిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డి ప్రజల ముందుంచారు. దేశంలోనే మొట్టమొదట కులగణన సర్వే నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణకు ఆ ఖ్యాతి దక్కిందని సీఎం అన్నారు. అలాగే పార్లమెంట్ లో కూడ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా తెలంగాణలో నిర్వహించిన సర్వే గురించి కామెంట్స్ చేశారు. ఇలా సర్వే జరిగిన తీరును కూడ యావత్ భారత్ ప్రశంసించింది. అయితే కొందరు సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వ వాదన. సంక్షేమ పథకాల అమలుకు సర్వే దోహద పడుతుందని, ప్రతి ఒక్కరూ సర్వేలో తమ పేర్లు, వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం తాజాగా ప్రకటన విడుదల చేసింది.
ఈ అంశానికి సంబంధించి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. భట్టి మాట్లాడుతూ.. అసెంబ్లీ లో కులగణన సర్వే గురించి స్పష్టంగా సిఎం రేవంత్ రెడ్డి సభ దృష్టికి తీసుకొని వచ్చి చర్చ చేశారన్నారు. సర్వే శాస్త్రీయంగా నిర్వహించి లెక్కలు వెలువరించడం జరిగిందన్నారు. కొద్ది మంది కావాలనే ఉద్దేశపూర్వకంగా వివరాలు ఇవ్వలేదని, అటువంటి వారు రాష్ట్రంలో 3.1% మంది ఉన్నట్లు భట్టి పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వారు కావాలనే ఈ సర్వేకి దూరంగా ఉండి.. కావాలనే మళ్ళీ అవకాశం ఇవ్వమని అడుగుతున్నారన్నారు.
ఫిబ్రవరి 16 నుండి 28 వరకు సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. మూడు రకాలుగా అవకాశం కల్పిస్తున్నామని, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడంతో పాటు, ఎంపిడిఓ కార్యాలయంలో ప్రజాపాలన సంబంధించి అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చని సూచించారు. కేసీఆర్, కేటీఆర్ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని జన జీవన స్రవంతిలో కలవాలని భట్టి కోరారు. మార్చ్ మొదటి వారంలో క్యాబినెట్ సమావేశంలో నివేదిక ముందుంచనున్నట్లు, బీసీ లకు 42% రిజర్వేషన్ ఇవ్వడం కోసం క్యాబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీ చట్టం చేస్తామన్నారు.
Also Read: రేషన్ కార్డు కోసం మీసేవకు వెళుతున్నారా.. ఈ పత్రాలు తప్పక తీసుకెళ్లండి
ఈ బిల్లు ని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపిస్తామని, పార్లమెంట్ చట్టం తెచ్చే విధంగా ఒత్తిడి తీసుకొని వస్తామన్నారు. అన్ని పార్టీలను కలుపుకుని కేంద్రం పై ఒత్తిడి తీసుకొని వస్తామని, కులగణన చేసేటప్పుడే ఈ లక్ష్యం గురించి తెలియని వారు, ఇందులో వివరాలు ఇవ్వని వారే మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ భట్టి అన్నారు. మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయని, ఆ లోపు ఈ బిల్లు పార్లమెంటు లో ప్రవేశపెట్టాలన్నారు. అన్ని రాజకీయపార్టీలు కలుపుకొని ముందుకు వెళ్తామని, ఈ సర్వే ఇక్కడ అమలైతే దేశవ్యాప్తంగా అమలు చేయాల్సి వస్తదని ఆపుతున్నారని భట్టి అభిప్రాయ పడ్డారు.