Minister Komatireddy: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అధికారికంగా ఆహ్వానం అందింది. తెలంగాణ రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న ఈ సమ్మిట్కు హాజరుకావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం తరపున ఆయన ముఖ్యమంత్రిని కోరారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025ను ప్రపంచ ప్రసిద్ధి చెందిన దావోస్ సమ్మిట్ తరహాలో నిర్వహిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి సంస్థల ప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాలు కలిసిమెలిసి అభివృద్ధి చెందాలనే ఆకాంక్షను ఈ సందర్భంగా మంత్రి వ్యక్తం చేశారు.
ఎవరినీ విమర్శించను…
గతంలో తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్-2020 గురించి మాట్లాడినప్పుడు ఆశ్చర్యపోయానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సమావేశం సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘కానీ ఇప్పుడు హైదరాబాద్ను చూస్తే ఆ విజన్ ఎంత నిజమైందో అర్థమవుతోంది’ అని ఆయన ప్రశంసించారు. ఇటీవల పవన్ కళ్యాణ్పై తాను చేసిన వ్యాఖ్యలు ఆనాటి పరిస్థితుల వల్లే అని, ప్రస్తుతం తాను ఎవరినీ విమర్శించడం లేదని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) భవిష్యత్తు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలు గాల్లో వస్తాయి.. గాల్లో పోతాయని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముక్కలవుతుందని తాను రెండేళ్ల కిందటే చెప్పానని.. ఇప్పుడు అదే నిజమైందని పేర్కొన్నారు. ‘నేను చెప్పింది జరిగిందా.. లేదా?’ అని ప్రశ్నించారు. ‘బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో వారికి ‘గుండు సున్నా’ దక్కింది. ఇంకెక్కడ ఉంది బీఆర్ఎస్ పార్టీ?’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జరిపిన ఈ సమావేశం ఇరు రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంచే దిశగా సాగింది. గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానంతో పాటు హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను మంత్రి కోమటిరెడ్డి కొనియాడటం చర్చనీయాంశమైంది.
ALSO READ: Minister Uttam Kumar: తమిళనాడు, జమ్ముకశ్మీర్లో మంత్రి ఉత్తమ్ బిజీ బిజీ.. సీఎంలకు ఆహ్వానం