Minister Uttam Kumar: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానాలు పంపే ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే పలువురి ప్రముఖులకు రేవంత్ సర్కార్ ఆహ్వానాలు పలికింది.. ఈ క్రమంలోనే.. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా జరిగే గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనవలసిందిగా ఒమర్ అబ్దుల్లాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.
లక్ష్యం.. త్రి – ట్రిలియన్ ఎకానమీ…
భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిని.. లక్ష్యాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నట్లు ఆయన తెలిపారు. ‘2047 విజన్ ఏంటో గ్లోబల్ సమ్మిట్లో వివరిస్తాం. త్రి-ట్రిలియన్ ఎకానమీ సాధించడమే మా లక్ష్యం’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సమ్మిట్కు దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ నేతలను ఆహ్వానించినట్లు మంత్రి చెప్పారు. అతి తక్కువ సమయంలోనే ఈ ఆహ్వానాలు పలకాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
సీఎంకు ఒమర్ అబ్దుల్లా కృతజ్ఞతలు
గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కృతజ్ఞతలు తెలిపారు. ఈ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు. ఈ చొరవతో హైదరాబాద్ ప్రపంచ స్థాయి అభివృద్ధి చెందుతుందని ఒమర్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇప్పటికే దేశంలో ప్రధాన నగరంగా ఉంది. ఇటువంటి అంతర్జాతీయ సదస్సులు నగర ఖ్యాతిని మరింత పెంచుతాయి.
సమ్మిట్ ప్రాధాన్యత ఇదే…
నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇంత పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు సన్నాహాలు చేయడం తెలంగాణ పాలన సంకల్పాన్ని సూచిస్తుంది. దేశ ఆర్థిక వృద్ధిలో రాష్ట్రం పాత్రను పెంచేందుకు, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సమ్మిట్ ఒక వేదిక కానుంది. ముఖ్యంగా, ‘త్రి-ట్రిలియన్ ఎకానమీ’ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ సదస్సు దిశానిర్దేశం చేస్తుంది.
సీఎం స్టాలిన్ను ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్..
అంతకుముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా జరిగే గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనవలసిందిగా సీఎం స్టాలిన్ ను మంత్రి సాదరంగా ఆహ్వానించారు.
ALSO READ: KCR: సర్పంచ్ ఎన్నికలు.. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు