Minister Ponguleti Srinivas Reddy Adopt Secunderabad Cantonment area After Lok Sabha Elections 2024: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓ శుభవార్త చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రిజిమెంటల్ బజార్ లో నిర్వహించిన ప్రచార ర్యాలీ, రోడ్ షోలలో పాల్గొన్న ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. పార్లమెంటు ఎన్నికల తరువాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి ప్రతి ఏటా 6 వేల ఇండ్లు కేటాయించి, ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ నిర్మించి ఇస్తామన్నారు.
మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి శ్రీ గణేశ్ కు మద్దతుగా ప్రచార సభలలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే.. అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న బిడ్డను విడిపించుకునేందుకు బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 4 నెలల కాలంలోనే తామిచ్చిన హామీలలో 5 అమలు చేశామని, మిగతావి కూడా, అదేవిధంగా ఇయ్యని హామీలను కూడా నెరవేరుస్తామని ఆయన అన్నారు.
Also Read: మాట ఇస్తే తల తెగి కింద పడ్డా వెనక్కి తిరిగి చూడను: సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ గెలిస్తే మంత్రి అవుతారని, సునీతా గెలిస్తే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆమె కూడా కేంద్ర మంత్రి అవుతారని.. దీంతో కంటోన్మెంట్ ను మరింత అభివృద్ధి చేసుకోవొచ్చని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణకు కేంద్రం రూ. లక్షల కోట్ల నిధులను కేంద్రం ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని.. కానీ, పన్నుల రూపంలో రూ. లక్షల కోట్లు తెలంగాణ నుంచి తీసుకున్న కేంద్రం కేవలం మూడో వంతు మాత్రమే తెలంగాణకు నిధులిచ్చిందంటూ కౌంటర్ ఇచ్చారు.
కాగా, నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్న విషయం తెలిసిందే. నర్సాపూర్, ఎల్బీనగర్ లలో నిర్వహించబోయే కాంగ్రెస్ జనజాతర సభలలో ఆయన పాల్గొని ప్రంసగించనున్నారు. అదేవిధంగా ప్రియాంకాగాంధీ కూడా ఈ నెల 11న రాష్ట్రానికి రానున్నారు. తాండూర్, కామారెడ్డిలలో నిర్వహించబోయే కాంగ్రెస్ జనజాతర సభలలో పాల్గొని ప్రజలనుద్దేశించి ఆమె ప్రసంగించనున్న విషయం తెలిసిందే.