Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ ఆలయానికి భద్రత పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ పై దాడి జరిగిన నేపథ్యంలో నిన్న మంత్రి కొండా సురేఖ, నేడు మంత్రి శ్రీధర్ బాబులు పరామర్శించారు. ఈ సంధర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి కూడ వారు చర్చించారు. అలాగే పోలీసులకు మంత్రులు కీలక ఆదేశాలు ఇచ్చారు.
చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ పై దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దాడి జరిగిన కారణాలను పోలీసులు ఆరా తీసి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ఈ దాడిని యావత్ భారత్ ఖండించింది. అన్ని రాజకీయ పార్టీలు కూడ రంగరాజన్ కు అండగా నిలిచాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న దాడిని ఖండిస్తూ.. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి కూడ ఫోన్ లో రంగరాజన్ ను పరామర్శించారు. ఈ దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా వదలబోమని సీఎం హామీ ఇచ్చారు.
ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ నిన్న సాయంత్రం వెళ్లి రంగరాజన్ ను పరామర్శించారు. నేడు మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావులు పరామర్శించారు. రంగరాజన్ ఆరోగ్య స్థితిని వారు అడిగి తెలుసుకున్నారు. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దేవుని పేరు, రాముడి పేరు మీద దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని హామీ ఇచ్చారు.
అలాగే మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రంగరాజన్ పై దాడి అమానవీయ చర్యగా పేర్కొన్న మంత్రి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాముని పేరు పై దాడులు చేస్తే సహించేది లేదని, నిందితుల్లో ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్టు చేశారన్నారు. రామరాజ్యం పేరీట అరాచకాలు సాగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద భద్రత పెంచమని పోలీసులను మంత్రి ఆదేశించారు. నిరంతరం భక్తుల రద్దీ ఉండే చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద భద్రత విషయంలో పోలీసులు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
Also Read: తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక.. కొద్దిరోజులు దూరంగా ఉండాలంటూ
ఇప్పటికే ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరికొందరి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ దాడి వెనుక గల అసలు కారణాలు తెలుసుకొనేందుకు పూర్తి స్థాయి దర్యాప్తు సాగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకుండా, పోలీసులు చట్టరీత్యా శిక్షించాలని హిందూ సంఘాలు, భక్తులు కోరుతున్నారు. అయితే ఈ కేసులో నిందితులు గతంలో ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారా లేదా అన్నది కూడ దర్యాప్తులో తెలియాల్సి ఉంది. పూర్తి విషయాలు పోలీసుల ప్రకటనతో వెల్లడి కావాల్సి ఉంది.