Minister Sridhar Babu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతామన్నారు మంత్రి శ్రీధర్బాబు. మాకు రాజకీయాలు, ఎన్నికలు ముఖ్యం కాదన్నారు. బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసమే తాము కులగణన సర్వే చేపట్టామన్నారు. మీరు రాజ్యాంగ సవరణ చేయడానికి సిద్ధమా అని బీజేపీని సూటిగా ప్రశ్నించారాయన. ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కార కోసం కమిషన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
హీటెక్కిన ఎమ్మెల్సీ ఎన్నికలు
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో అధికార కాంగ్రెస్-విపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరిపాకాన పడింది. ఒకరిపై మరొకరు సవాళ్లు-ఛాలెంజ్లు విసురుకోవడం మొదలైంది. ఈ క్రమంలో బీఆర్ఎస్తోపాటు బీజేపీపైనా మండిపడ్డారు మంత్రి శ్రీధర్బాబు.
రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పనులు, ప్రాజెక్టుల గురించి వివరించారు సదరు మంత్రి. సామాజిక, రాజకీయ, ఆర్ధిక అంశాలపై తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. గత 10 ఏళ్ళలో పట్టభద్రులు మోసపోయి తమపై నమ్మకంతో అధికారం కట్టబెట్టారని గుర్తు చేశారు.
నిరుద్యోగులకు ఇప్పటికే 56 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. తొలిసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని, గత ప్రభుత్వ తప్పిదం వల్లే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పిందన్నారు. 317 జీవోను బీజేపీ ప్రభుత్వం ఆమోదించి, ఇప్పుడు ఆ జీవోపై ఉద్యమం చేసిందని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు.
ALSO READ: మందుబాబులకు షాక్.. ఆ మూడు రోజులు బంద్
ఏడాదిలో చేసిన పనులు
317 జీవోపై అధికారులతో చర్చించి న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ న్యాయం జరిగేలా చర్యలు చేపడతామన్నారు. డీఎస్సీ ద్వారా 10,000లకు పైగా నియామకాలు చేపట్టామని వివరించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రూప్-1 పరీక్షలు నిర్వహించకుండా బీఆర్ఎస్-బీజేపీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కేవలం ఒక్క ఏడాదిలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు.
పట్టభద్రుల సమస్యలపై బీజేపీ వైఖరి ఏంటో స్పష్టం చేయకుండా, తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్తిపై దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు మంత్రి. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 66 ఐటీఐ సెంటర్లను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.
భవిష్యత్తులో విద్యార్థుల కోసం ఇంటర్న్షిప్ ప్రవేశ పెట్టబోతున్నట్లు మనసులోని మాట వెల్లడించారు. దేశానికే ఆదర్శంగా బలహీన వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేపట్టామన్నారు. దీనిపై ఆ పార్టీ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. బీజేపీ-బీఆర్ఎస్లు కుమ్ముక్కు అయ్యాయని, అందుకే కారు పార్టీ తమ అభ్యర్థిని నిలుపలేదన్నారు.
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
అటు బీజేపీ కూడా ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మెదక్, ఖమ్మం పర్యటిస్తుండగా, బండి సంజయ్ మాత్రం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అధికార పార్టీపై పైచేయి సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు ఆ పార్టీ నేతలు. ఆ రెండు పార్టీలూ ఒకటే అని బీజేపీ అంటోంది. లోక్సభ ఎన్నికల మాదిరిగా బీజేపీ-బీఆర్ఎస్ ఒకటయ్యాయని అధికార కాంగ్రెస్ అంటోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతాం: మంత్రి శ్రీధర్ బాబు
మాకు రాజకీయాలు, ఎన్నికలు ముఖ్యం కాదు.. బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసమే కులగణన సర్వే
మీరు రాజ్యాంగ సవరణ చేయడానికి సిద్ధమా అని బీజేపీని సూటిగా అడుగుతున్నాను
ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కార కోసం కమిషన్ ఏర్పాటు చేశాం… pic.twitter.com/PXTtjKeFLY
— BIG TV Breaking News (@bigtvtelugu) February 23, 2025