Ramagundam: రామగుండంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని నిరుపేదలకు, సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రామగుండం పట్టణాన్ని అన్ని సౌకర్యాలతో హైదరాబాద్ నగరంగా సుందరీకరిస్తామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు.రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఇళ్లు, ఆస్తులు కోల్పోయిన వారెవరూ ఆందోళన చెందవద్దని, వారికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.నష్టపోయిన వారికి ప్రత్యామ్నాయంగా ఇళ్ల సౌకర్యం కల్పించాలని, వారి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కలెక్టర్ను ఆదేశించినట్లు తెలిపారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పేదలను మోసం చేశారని మంత్రి పొంగులేటి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేవలం మొండిగోడలతో దర్శనమిస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల ఆలోచనల మేరకు.. ఆ మొండిగోడలన్నింటికీ స్లాబ్లు వేసి, ప్లాస్టరింగ్ పూర్తి చేసి పేదలకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు.
రామగుండం ప్రాంతం ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు, కష్టాలను తాను దగ్గరుండి చూశానని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ ప్రాంతంలో ఆసుపత్రులు, వసతుల కల్పన పెద్ద ఎత్తున జరిగిందని గుర్తుచేశారు. సింగరేణి కార్మికులు పడుతున్న కష్టం వల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున రాబడి వస్తోందని, వారు రాష్ట్రానికి ఒక ‘ఆస్తి’ వంటి వారని కొనియాడారు. కార్మికులకు కేవలం స్థలాలు ఇవ్వడమే కాకుండా, ఇండ్లు కూడా కట్టించి ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
Read Also: CPI Narayana: సిగ్గు లేకుండా అడిగితే.. పెంచేస్తారా? టికెట్ల రేట్లపై సీపీఐ నారాయణ ఫైర్!