మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో విచారణ ముమ్మరమైంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని విచారించేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసుల అభ్యర్థనను మన్నించిన న్యాయస్థానం.. నిందితులను మరో రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 11, 12 తేదీల్లో సిట్ అధికారులు వీరిని తమ ఆధీనంలోకి తీసుకుని విచారణ కొనసాగించనున్నారు.
ప్రస్తుతం చంచల్ గుడా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులను రేపు ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. ఈ రెండు రోజుల విచారణలో ప్రధానంగా ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించనున్నారు. నిందితుల మధ్య జరిగిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ డ్రగ్స్ సరఫరాకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. భారీ మొత్తంలో చేతులు మారిన నగదుకు సంబంధించిన ఆధారాలను సేకరించిన సిట్.. వాటిపై నిందితులను ప్రశ్నించి వాస్తవాలు రాబట్టాలని భావిస్తోంది.
డ్రగ్ పార్టీల నిర్వహణ వెనుక ఉన్న సూత్రధారులను కనిపెట్టడం ఇప్పుడు అధికారులకు సవాలుగా మారింది. ఈ నెట్వర్క్ ఎక్కడి వరకు విస్తరించింది? విదేశీ లింకులు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ విచారణ సాగుతోంది. గతంలో జరిగిన పార్టీలకు హాజరైన వ్యక్తుల వివరాలను నిందితుల నుంచి సేకరించే అవకాశం ఉంది. బ్యాంకు ఖాతాల్లోని అనుమానాస్పద లావాదేవీలపై సిట్ బృందం ఇప్పటికే ఒక నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
నిందితుల ఫోన్ డేటా ఆధారంగా మరికొంత మందిని విచారించే అవకాశం కనిపిస్తోంది. టెక్నికల్ ఎవిడెన్స్ను ముందుంచి నిందితులను విచారించడం ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ రెండు రోజుల కస్టడీ ఈ కేసులో అత్యంత కీలకంగా మారనుంది.
ALSO READ: బెంగళూరులో జాంబీ డ్రగ్ కలకలం.. నిలబడ్డ చోటే ఘోరం? అసలు నిజాలు బయటపెట్టిన పోలీసులు