MP Chamala: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో కిషన్ రెడ్డి వైఖరిని ఎండగడుతూ ఆయన పలు ప్రశ్నలు సంధించారు.
తెలంగాణకు ఏం చేశారు?
‘నన్ను ఆపే ధైర్యం ఎవరికీ లేదు’ అంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతుండటంపై చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మిమ్మల్ని కేంద్ర మంత్రి స్థాయికి తీసుకెళ్లిన తెలంగాణ ప్రజలకు ఏదైనా మంచి పని చేస్తుంటే ఎవరు అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కిషన్ రెడ్డిని ఇక్కడి ప్రజలు రెండుసార్లు ఎంపీగా గెలిపించారని, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉండి ఆయన రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను బీజేపీలోనే పుట్టాను, అక్కడే ఉంటాను అనే కిషన్ రెడ్డి వ్యక్తిగత విషయాలతో తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు
గడిచిన పదేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటుంటే కిషన్ రెడ్డి ఏం చేశారని ఎంపీ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కిషన్ రెడ్డి కేవలం మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు మాత్రమే చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఓట్లతోనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
కేంద్రం వైఖరి ఏంటి?
తెలంగాణలో వరి ధాన్యం, మొక్కజొన్నలు కొనాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి అడగడం ఏ రకంగా తప్పవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి నిలదీశారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రం సహకరిస్తుందో లేదో కిషన్ రెడ్డి స్పష్టం చేయాలన్నారు. అలాగే హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు, మూసీ నది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారంపై ఆయన వైఖరి ఏంటో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జాతకాలు మాకొద్దు
కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేదని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరంటూ కిషన్ రెడ్డి చెబుతున్న జాతకాలు తెలంగాణ ప్రజలకు అవసరం లేదని ఎంపీ హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ ‘కాళ్లల్లో కట్టెలు పెట్టవద్దు’ అని సీఎం రేవంత్ రెడ్డి అనడంలో తప్పేముందని, ఈ విషయాలన్నింటినీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: ఈ జన్మలో రాహుల్ గాంధీ ప్రధాని కాలేడు.. రాసిపెట్టుకోండి- కిషన్ రెడ్డి
కిషన్ రెడ్డిపై ఎంపీ చామల ఫైర్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రమంత్రిగా ఉండి తెలంగాణకు చేసిన మేలేమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మ్యాచ్ఫిక్సింగ్ రాజకీయాలు మానుకుని, రాష్ట్ర అభివృద్ధికి, ప్రాజెక్టులకు కేంద్ర… pic.twitter.com/WzajWKWagC
— ChotaNews App (@ChotaNewsApp) June 7, 2026