New Party: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో త్యాగం చేసి సాధించుకున్నప్పటికీ ఆశించిన మార్పు ప్రజలకు పూర్తిగా అందలేదనే భావనతో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తోందని తెలంగాణ జాగృతి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ చారి తెలిపారు. మేడ్చల్ మండలం మునీరాబాద్లో ఈ నెల 25న నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో అనేక మంది ఉద్యమకారులు కొత్త పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు సభకు హాజరుకావద్దని, రాబోయే రోజుల్లో మరిన్ని సభలు నిర్వహించి అందరినీ కలుసుకుంటామని సూచించారు. సభకు ముందు అమరవీరుల స్తూపం వద్ద కవిత నివాళులు అర్పించి అనంతరం పార్టీ విధివిధానాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. పార్టీ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించి, అన్ని నియోజకవర్గాల్లో జెండాలను ఎగురవేయనున్నట్లు వెల్లడించారు.
Also read: వేసవిలో మజ్జిగ తాగుతున్నారా? వీళ్లు దూరంగా ఉంటేనే బెటర్
మునీరాబాద్లో ఈ నెల 25న నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. సభకు సుమారు 40 వేల మంది ప్రజలను సమీకరించేలా నిర్వాహకులు విస్తృత ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభమై, ఉదయం 10 గంటలకు పార్టీ పేరును అధికారికంగా ప్రకటించి, అనంతరం పార్టీ జెండా ఆవిష్కరణ నిర్వహించనున్నట్లు వివరించారు.
మధ్యాహ్నం 12 గంటలకు సుమారు 2000 కార్లతో భారీ ర్యాలీ మునీరాబాద్ నుంచి జూబ్లీహిల్స్ పార్టీ కార్యాలయం వరకు సాగుతుందని, మార్గమధ్యంలో పలుచోట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామ్ కిషన్ రావు, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు కే. శివ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆర్. వెంకట రెడ్డి, ఇస్మాయిల్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: కూలర్లో ఇదొక్కటి వేస్తే ఏసీ లాంటి చల్లని గాలి.. కేవలం రూ.5 ఖర్చుతో సూపర్ కూలింగ్