Vande Bharat Accident: స్వేచ్ఛ బ్యూరో: మౌలాలి రైల్వే స్టేషన్లో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కళ్లముందే కుమార్తె ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలేలా విలపించిన తీరు అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది.
అసలేం జరిగిందంటే..
జనగామ ప్రాంతానికి చెందిన మానేపల్లి మానస (20) వృత్తిరీత్యా నర్స్గా పనిచేస్తోంది. ఆదివారం కుటుంబ సమేతంగా గోల్కొండ ఎక్స్ప్రెస్లో ప్రయాణించి మౌలాలి రైల్వే స్టేషన్కు చేరుకుంది. రైలు దిగిన తర్వాత ప్లాట్ఫామ్ నంబర్ 2 నుంచి నంబర్ 1 వైపు వెళ్లడానికి కాళ్లదారిన పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది.
ఒక్కసారిగా విరుచుకుపడ్డ ప్రమాదం
మానస పట్టాలు దాటుతుండగా, అదే సమయంలో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వేగంగా వస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆమెను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘోరాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
పోలీసుల విచారణ
సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: అమెరికా సైనికుడిని పట్టిస్తే భారీ రివార్డ్.. మహిళలకైతే డబుల్ ఆఫర్ ఇచ్చేసిన ఇరాన్!