తెలంగాణ పోలీస్ శాఖలో ప్రస్తుతం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పెను కలకలం సృష్టిస్తున్నాయి. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన రక్షకులే ఈ వ్యసనానికి బానిసలై ప్రాణాలు తీసుకోవడం, నేరాలకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా చోటుచేసుకున్న వరుస ఘటనలు పోలీస్ యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. గడిచిన కొద్ది రోజులుగా పోలీస్ శాఖలో బెట్టింగ్ మహమ్మారి ఎంతలా పాకిందో అర్థమవుతోంది. నిన్న హైడ్రా (HYDRAA) కమిషనర్ గన్మెన్ కృష్ణచైతన్య ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది. అంతకుముందు సంగారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ సందీప్ కుమార్ ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని, అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కేవలం ప్రాణాలు తీసుకోవడమే కాకుండా… ఈ వ్యసనం పోలీసులను నేరాల వైపు కూడా నడిపిస్తోంది. అంబర్పేట్ ఎస్సై భాను ప్రకాష్ ఉదంతం ఇందుకు నిదర్శనం. బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకున్న ఆయన, ఆ అప్పులు తీర్చడం కోసం ఏకంగా డిపార్ట్మెంట్ గన్ తాకట్టు పెట్టడంతో పాటు.. రికవరీ చేసిన బంగారాన్ని కూడా అమ్ముకున్నారనే ఆరోపణలు విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ ఆందోళనకర పరిస్థితులపై రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు స్పందించారు. డీజీపీ సమక్షంలో ఉన్నతాధికారులందరూ దీనిపై ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. యువ పోలీసుల్లో పెరుగుతున్న ఈ ధోరణిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉద్యోగంలోకి కొత్తగా చేరిన యువ పోలీసులు ఈ యాప్స్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని గుర్తించారు.
కమిషనర్ విశ్లేషణ ప్రకారం.. ‘తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశ, విలాసవంతమైన జీవితంపై మోజు పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. పక్కవారిని చూసి తాము కూడా త్వరగా ఎదిగిపోవాలనే తపనతో ఈ ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ ఊబిలో కూరుకుపోతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. శాఖలో క్రమశిక్షణను కాపాడేందుకు మరియు సిబ్బంది ప్రాణాలను రక్షించేందుకు ఉన్నతాధికారులు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఆడుతున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని, బాధ్యులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. అప్పుల ఊబిలో ఉన్న పోలీసులకు కౌన్సెలింగ్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
ఈ పరిణామాలు తెలంగాణ పోలీస్ శాఖలో నైతిక విలువలపై చర్చకు దారితీశాయి. రక్షకులే భక్షకులుగా మారకుండా, వ్యసనాలకు బానిసలై తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోకుండా ఉండాలని పోలీస్ బాసులు సూచిస్తున్నారు.