Fake Kidney stones Medicine Patri Care | కిడ్నీల్లో రాళ్ల సమస్య చికిత్స కోసం ఉపయోగపడుతుందని ప్రకటనలతో ఒక ఆయుర్వేదిక్ సిరప్ ని మందులషాపులో విక్రయించడం జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఆ మందులషాపులో తనఖీలు చేశారు. పెద్దపల్లిలోని ఓ మెడికల్ స్టోర్ లో పత్రి కేర్ (హిందీలో కిడ్నీ రాళ్లను పత్రి అంటారు) పేరుతో కిడ్నీరాళ్ల సమస్యకు పరిష్కారమవుతుందని తప్పుడు ప్రకటనలతో ఉన్న సిరప్ విక్రయాలను నిలిపివేసింది. ఆ పత్రీ సిరప్ స్టాక్ మొత్తం అధికారులు సీజ్ చేశారు.
బుధవారం.. జనవరి 8, 2025న పెద్దపల్లిలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పి. శ్రవణ్ కుమార్ నేతృత్వంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారుల బృందం తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పత్రీ కేర్ (Patri care syrup) సిరప్ అనే పేరుగల ఆయుర్వేదిక్ టానిక్ కిడ్నీలో రాళ్లకు చికిత్స చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో అధికారులు పత్రీకేర్ సిరప్ స్టాక్ మొత్తం సీజ్ చేశారు. సదరు మెడికల్ షాపు యజమానులపై, ఆ సిరప్ పంపిణీ చేసిన కంపెనీ, తయారు చేసిన కంపెనీపై చట్ట ప్రకారం కేసు నమోదు చేశారు.
డ్రగ్స్ అండ్ మేజిక్ రెమిడీస్ (ఆబ్జెక్షనెబుల్ అడ్వర్టైజ్మెంట్స్) యాక్ట్ 1954, (ఔషధాల తప్పు ప్రకటనల చట్టం 1954 ) ప్రకారం.. కొన్ని రోగాలు, రగ్మతలకు చికిత్స జరుగుతుందని ప్రకటనలు చేసి నిరుపయోగ లేదా హానికారక ఔషధాలను ప్రజలకు మోసపూరితంగా విక్రయించడం నేరం.
Also Read: చినిగిన షర్టు ముక్కతో హంతకుడిని పట్టుకున్న పోలీసులు.. సినిమా కాదు రియల్!
ఈ పత్రీ కేర్ సిరప్ ని గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరానికి చెందిన అల్లోస్ ఫార్మాసిటికల్స్ పంపిణీ చేస్తుండగా.. దీన్ని తయారు చేసింది గుజరాత్ లోని గాంధీనగర్ కు చెందిన భవానీ ఫార్మాసిటికల్స్ అని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. చట్ట ప్రకారం.. ఈ కంపెనీలపై కేసు నమోదు చేసి విచారణ చేపడతామని ఆయన తెలిపారు. ఔషధాల తప్పు ప్రకటనల చట్టం 1954 ప్రకారం.. ఇలాంటి మోసపూరిత ప్రకటనలతో మందులు విక్రయించే వారికి ఆరు నెలల జైలు లేదా ఫైన్ లేదా రెండూ శిక్షలుగా విధించే అవకాశముంది.
గతంలో పతంజలి కంపెనీకి చెందిన బాబా రామ్ దేవ్ పై కూడా తప్పుడు ప్రకటనలో ‘కోరొనిల్’ అనే ఔషధం విక్రయించి వందల రూ. కోట్లు సంపాదించారనే కేసులు నమోదయ్యాయి. కరోనా సమయంలో ప్రజల భయాందోళనలకు అవకాశంగా తీసుకొని పతంజలి కంపెనీ ‘కొరొనిల్’ ఔషధం కరోనాను నయం చేస్తుందని దేశవ్యాప్తంగా భారీగా విక్రయాలు చేసింది.
ఇలాంటి ఔషధాలపై ఎటువంటి పరిశోధనలు చేయకుండా లేదా ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొన్ని కంపెనీలు తప్పుడు ప్రకటనలతో మార్కెట్లో విక్రయాలు సాగిస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో బిజినెస్ చేస్తున్న ఇటువంటి కంపెనీల గురించి, తప్పుడు ప్రకటనల గురించి ఫిర్యాదు చేయడానికి తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కు ఫోన్ చేయాల్సిన నెంబర్ 1800-599-6969. వారంలో ఏడు రోజులూ.. ఉదయం 10.30 గంట నుంచి సాయంత్రం 5.00 గంటల లోపు ఈ నెంబర్ కు ఫోన్ చేయగలరని డ్రగ్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ జెనెరల్ విబి కమలాసన్ రెడ్డి ఐపిఎస్ ఒక ప్రకటన జారీ చేశారు.