⦿ కలెక్టర్పై దాడి ఘటనలో కుట్ర కోణం
⦿ కథంతా నడిపించిన బీఆర్ఎస్ నేత సురేష్
⦿ పాత్రధారి సరే.. అసలు సూత్రధారులెవరు?
⦿ కాల్ డేటాలో అసలు గుట్టు.. బయటపెడతామన్న పోలీసులు
⦿ గులాబీ నేతలకు అభివృద్ధి పట్టదా?
⦿ ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కుట్రలేనా?
⦿ హైడ్రా కూల్చివేతలపై తప్పుడు ప్రచారం
⦿ మూసీ పునరుజ్జీవం అంశంలోనూ అంతే
⦿ ఇప్పుడు ఫార్మా కంపెనీ వ్యవహారంలోనూ అదే తీరు
⦿ పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్పై దాడి
⦿ గ్రామస్తులను ఉసిగొల్పిన బీఆర్ఎస్ నేత సురేష్
⦿ అతని వెనుక పట్నం నరేందర్ రెడ్డి, కేటీఆర్?
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: Pharma Company Violence: తెలంగాణను పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, అనేక స్కాములు, విమర్శలు, ఆరోపణలను మూటగట్టుకుంది. చివరకు ఇకచాలు మీరొద్దు మహా ప్రభో అంటూ ప్రజలు ఓడించి ఇంటికి పంపారు. పదేళ్ల నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి తనదైన పంథాలో పాలనను కొనసాగిస్తున్నారు. కానీ, ప్రభుత్వ నిర్ణయాలపై బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. సచివాలయం నుంచి ఏ జీవో వచ్చినా, ఏ ప్రాజెక్ట్ చేపట్టినా అడ్డుకోవడం, ఉద్రిక్తతలకు దారి తీసేయాల చేయడం గులాబీ నేతలకు అలవాటుగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా కలెక్టర్పై జరిగిన దాడి ఘటనతో ఇప్పటిదాకా బీఆర్ఎస్ వ్యవరించిన తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
కేసీఆర్ అలా.. కేటీఆర్ ఇలా!
మాజీ సీఎం కేసీఆర్ చాలాకాలం తర్వాత ఈ మధ్యే బయటకొచ్చారు. పాలకుర్తి నేతలను కలిసి, ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. ఇన్నాళ్లూ వేచి చూశాం, ఇకపై యుద్ధమే అన్నట్టు మాట్లాడారు. కానీ, కేసీఆర్ చెప్పినట్టుగా ఈ 11 నెలలు బీఆర్ఎస్ సైలెంట్గా వేచి చూసిందేమీ లేదు. ప్రభుత్వ నిర్ణయాలపై కావాలనే కుట్రలు చేస్తూ వస్తోందనేది కాంగ్రెస్ నేతల వాదన. దీనికి అనేక విషయాలను ఉదాహరణ చూపిస్తూ నిజానిజాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. గులాబీ కుట్రలను బహిర్గతం చేస్తున్నారు. వికరాబాద్ కలెక్టర్ ఘటనలోనూ బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని అనుమానిస్తున్నారు.
పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్పై దాడి
వికారాబాద్ జిల్లా లగచర్ల పరిధిలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం భూసేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయసేకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం లగచర్ల ఏరియాలో పర్యటించారు. అయితే, బీఆర్ఎస్ నేత సురేష్, కలెక్టర్తో మాట్లాడి లగచర్లకు తీసుకెళ్లాడు. సానుకూల దృక్పథంతో కలెక్టర్ గ్రామం లోపలికి వెళ్లారు. అయితే, ఆయన అక్కడకు వెళ్లే లోపే కర్రలు, రాళ్లతో దాడికి ముందుగా ప్లాన్ చేసుకున్నారు.
ఈ విషయాన్ని విచారణలో గుర్తించినట్టు ఐజీ సత్యనారాయణ తెలిపారు. దాడి కేసులో 20 మందిని అరెస్ట్ చేశామని, మూడు నాన్ బెయిలబుట్ కేసులు పెట్టినట్టు స్పష్టం చేశారు. పోలీసుల వైఫల్యం ఎక్కడా లేదని, పక్కా ప్లాన్ ప్రకారం దాడి జరిగిందని వివరించారు. సురేష్ వెనుక ఉన్న వారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అతని కాల్ డేటాను సేకరించామని, పరిశీలించాక త్వరలోనే వివరాలు బయటపెడతామని తెలిపారు.
సురేష్తో పట్నం.. ఆయనతో కేటీఆర్ మంతనాలు?
ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని పోలీసులు తేల్చారు. దాడికి పాల్పడింది బీఆర్ఎస్ నేతగా చెప్పారు. ఇతను స్థానిక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా గుర్తించారు. ఇతనిపై ఇప్పటికే ఓ అత్యాచార కేసు నమోదై ఉంది. చెల్లెలి వరుస అయ్యే అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినందుకు కేసు రిజిస్టర్ అయింది. ఇంకా పలు కేసులు ఉన్నట్టు తెలుస్తోంది.
వాటిని తొలగించేలా పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సహకరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు, తాజా దాడికి కొన్ని గంటల ముందు పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ 42 సార్లు మాట్లాడాడని, సురేష్తో మాట్లాడుతూ ఆరు సార్లు కేటీఆర్తో పట్నం ఫోన్లో మాట్లాడారని ప్రచారం జరుగుతోంది. అతని ఫోన్ డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు.
అభివృద్ధికారకులు కాదు.. నిరోధకులు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నాయకులే అనేక అవరోధాలు సృష్టిస్తున్నారని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. పారిశ్రామికీకరణ, అభివృద్ధిని అడ్డుకున్న ఘటనలు గతంలో జరగలేదని, అలాంటిది ఇప్పుడు జరిగిందని, దీన్నిబట్టి బీఆర్ఎస్ ఉద్దేశం ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా హైడ్రా కూల్చివేతలను, మూసీ పునరుజ్జీవం అంశాల్లో కూడా బీఆర్ఎస్ వ్యవహరించిన తీరును వివరిస్తున్నారు హస్తం నాయకులు.
Also Read: Vizag News: ఆ శిశువు జననమే మహా అద్భుతం.. వైజాగ్ లో వెలుగులోకి.. అసలేం జరిగిందంటే?
పేదల ఇళ్లను హైడ్రా కూల్చికపోపోయినా కూల్చివేసిందని బీఆర్ఎస్ తప్పుడు సంకేతాలను జనంలోకి తీసుకెళ్లిందని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, మూసీ పునరుజ్జీవంపైనా ఏదో తప్పు జరుగుతోందని లేనిపోనివి ప్రజలకు చెబుతూ ధర్నాలకు ఉసిగొల్పిందని చెబుతున్నారు. ఇంకా ఇవే కాదు, ఓవైపు ఉద్యోగాలు భర్తీ జరుగుతున్నా, నిరుద్యోగులను రెచ్చగొట్టి ధర్నాలు చేయించడం వంటివి చేయిస్తోందని వివరిస్తున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 11 నెలల కాంగ్రెస్ పాలనలో ఏ నిర్ణయం తీసుకున్నా తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రతీ దాన్ని రాజకీయంగా వాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు.