Hyderabad Tank Bund: హైదరాబాద్ నగరమంతా ఈ రోజు వినాయక నిమజ్జన సంబరాలతో మార్మోగిపోయింది. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. వేలాది మంది భక్తులు ఉత్సాహంగా గణనాథుడి నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్నారు. డప్పు మోగుతుండగా, డీజే పాటలకు యువతతో డాన్సులు చేస్తూ నిమజ్జన వేడుకలో పోలీసులు కూడా భాగమయ్యారు.
ఈ నిమజ్జన శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పోలీసులు. ఒకవైపు తమ విధులను బాధ్యతగా నిర్వహిస్తూనే, మరోవైపు ప్రజలతో కలసి ఆహ్లాదంగా డాన్స్ చేశారు. డప్పుల మోతకు స్టెప్పులు వేస్తూ, భక్తులతో మమేకమై కాసేపు ఆనందించారు. ఈ దృశ్యాలు చూసిన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రక్షక భటులు ఇలా ఉత్సవాల్లో భాగమై, భక్తులకు దగ్గరవడం అందరినీ ఆకట్టుకుంది.
నగరమంతా ఎక్కడ చూసినా విభిన్న రూపాల్లో గణేశ విగ్రహాలు కనువిందు చేశాయి. వెరైటీ వినాయక విగ్రహాలు భక్తులను ఆకర్షించాయి. కొన్ని విగ్రహాలు నూతన రూపకల్పనతో, అలంకరణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. వీటిని చూసేందుకు భక్తులు ఆసక్తిగా నిలబడి తిలకించారు.
ఇక నిమజ్జన శోభాయాత్రలో భాగంగా పెద్ద మొత్తంలో గణనాథులు ట్యాంక్ బండ్ వైపు తరలించబడ్డారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. డీజే మ్యూజిక్, డప్పుల మోత, ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ గణనాథుని ఊరేగింపులో పాల్గొన్న యువత సంబరాలు సందడిని మరింత రెట్టింపు చేశాయి.
Also Read: Hyderabad Water: హైదరాబాద్లో 48 గంటల నీళ్లు బంద్.. ఏ ఏరియాల్లో అంటే?
ఈ సందర్భంలో తెలంగాణ డీజీపీ జితేందర్ మాట్లాడుతూ, “హైదరాబాద్ నగరంలో పెద్దమొత్తంలో నిమజ్జనాలు ఈ రోజు పూర్తవుతాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కూడా నిమజ్జనాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నిమజ్జనాలు ముగిశాయి. ఎక్కడైతే భద్రత అవసరమో అక్కడ పోలీసు బందోబస్తు కేటాయించాం” అని చెప్పారు.
నిమజ్జన వేడుకల మధ్య ఒక కీలక సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించారు. ఎలాంటి ప్రత్యేక వాహనాలు, బలమైన కాన్వాయ్ లేకుండా, పరిమిత వాహనాలతో సాధాసీదాగా ట్యాంక్ బండ్కి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రావడం ఎవరూ ఊహించలేదు. అందుకే సడెన్గా సీఎం రేవంత్ రెడ్డిని చూసిన భక్తులు ఆయన చుట్టూ చేరిపోయారు. సాధారణుడిలా నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలిస్తూ, భక్తులతో మమేకమైన ఆయన దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి.
హైదరాబాద్లో ఈ రోజు జరగుతున్న నిమజ్జనాలు, పోలీసులు చేసిన డాన్స్, వెరైటీ వినాయక విగ్రహాలు, భక్తుల ఉత్సాహం, ఇవన్నీ కలసి నిమజ్జన వేడుకలను మరింత వైభవంగా మార్చాయి. నగరం గణనాథుడి నినాదాలతో మార్మోగిపోయింది.
నిమజ్జనం శోభాయాత్రలో ఉత్సాహంగా పోలీసుల డాన్స్
నిమజ్జన కార్యక్రమాల్లో ఒకవైపు బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూనే, డాన్స్ చేసి ఉత్తేజపరుస్తున్న పోలీసులు #GaneshVisarjan2025 pic.twitter.com/qgmEjjLH0T
— BIG TV Breaking News (@bigtvtelugu) September 6, 2025