Ponguleti Srinivas : గడిచిన పదేళ్లల్లో తెలంగాణ రాష్ట్రం ఇళ్ల నిర్మాణంలో వెనుకబడిపోయిందన్నారు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. ఇప్పుడైన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం జరగాలన్నారు. ఇందుకోసం.. రానున్న రోజుల్లో భారీగా పేదలకు ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్న మంత్రి.. కేంద్ర ప్రభుత్వం సైతం తనవంతు సాయం అందించాలని కోరారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కి స్వాగతం పలికిన మంత్రి పొంగులేటి.. రాష్ట్ర ప్రజల అవసరాలు, ప్రభుత్వ ప్రాధాన్యతల్ని ఆయన ముందుంచారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో ఇళ్లు లేని పేదలకు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. కేంద్ర అందించే సాయానికి అదనపు సొమ్ముల్ని జోడించి రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ఎక్కువగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చవచ్చు. ఈ విధానంలో.. కేంద్రం ఎక్కువ ఇళ్లు కేటాయిస్తే.. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సైతం అదనపు సొమ్ముల్ని కలిపి.. ఎక్కువ మందికి సాయంగా నిలవచ్చని భావిస్తోంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల నిర్మాణానికి సాయం చేయలేదని, ఇళ్లు కట్టించలేదని ఆరోపించారు. దాంతో.. గత పదేళ్లుగా ఇళ్ల కోసం ప్రజల నుంచి భారీ ఎత్తున డిమాండ్ ఉందని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు అవసరమైన ఇళ్లు కేేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా.. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మంత్రి పొంగులేటి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇద్దరు మంత్రులు.. కరీంనగర్ వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ముగించుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో పొంగులేటి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన అనేక విషయాల్ని కేంద్ర మంత్రి ముందు ప్రస్తావించారు.
రాష్ట్రంలో పేదలు ఇళ్లు కావాలని కోరుతున్నా పట్టించుకోలేదని ఆరోపించిన పొంగులేటి.. హౌసింగ్ విభాగాన్ని నిర్వీర్యం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విభాగంలోని ఉద్యోగుల్ని ఇతర శాఖలకు సర్దుబాటు చేశారని దాంతో పెద్ద సంఖ్యలో ఖాళీలున్నాయన్నారు. ఈ పరిస్ధితులలో ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రకటించారు. వచ్చే నాలుగేళ్లల్లో 20 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని, ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు.
గృహ నిర్మాణ శాఖకు తిరిగి పునరుజ్జీవనం కల్పిస్తున్నామంటు ప్రకటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం రాష్ట్రంలో ఇళ్లు లేని వ్యక్తులు సుమారు 44 లక్షల మంది ఉన్నారని వెల్లడించారు. వీరి గుర్తింపును నిర్థరించేందుకు అధునాతన పద్ధతుల్ని వినియోగిస్తున్నట్లు తెలిపిన మంత్రి పొంగులేటి.. జియో ట్యాగింగ్, వారి ప్రస్తుత నివాసం వివరాలు, ఇతర సమాచారాన్ని డాక్యుమెంటేషన్ చేసేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించినట్లు వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. తుది జాబితాల రూపకల్పన కోసం ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహించి.. నిజమైన లబ్దిదారుల్ని ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
Also Read : బీఆర్ఎస్కు బిగ్ షాక్.. బీజేపీలోకి కీలక నేత..?
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా మొదటి విడత దేశ వ్యాప్తంగా రెండు కోట్ల ఇళ్లు మంజూరు చేశారని.. అందులో తెలంగాణకు దక్కింది కేవలం 1.58 లక్షల ఇళ్లు మాత్రమే అన్నారు. మొత్తం మంజూరైన ఇళ్లల్లో ఇది కేవలం 0.79 శాతమేనన్నారు. కానీ.. దేశంలోని మొత్తం పట్టణ జనాభాలో తెలంగాణ వాటా 8 శాతంగా ఉన్నట్లు గుర్తు చేశారు. ఈ ప్రాతిపదికన చూస్తే.. రాష్ట్రానికి మరో 24 లక్షల ఇళ్లు రావాల్సి ఉంటుందన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం (2.0) కింద కనీసం 20 లక్షల ఇళ్లు కేటాయించాలని కేంద్ర మంత్రికి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విజ్ఞప్తి చేశారు.