Rohit Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై బీజేపీ అటాక్ కొనసాగుతూనే ఉంది. ఫాంహౌజ్ ఎపిసోడ్ తో హాట్ టాపిక్ గా మారిన రోహిత్ రెడ్డి.. ఇప్పుడు ఈడీకి, బీజేపీకి టార్గెట్ కావడంతో మరింతగా వార్తల్లో ఉంటున్నారు. కర్నాటక డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన రోహిత్.. తాజాగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశారు. తనకు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్టు నిరూపించాలంటూ బండి సంజయ్ కు సవాల్ కూడా విసిరారు.
కట్ చేస్తే, పైలెట్ రోహిత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సెటైర్లు వేశారు. రోహిత్రెడ్డికి డ్రగ్స్ అలవాటు లేదని భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ప్రమాణం చేయాల్సిందన్నారు. బీఆర్ఎస్కు ప్రమాణాల మీద ఎప్పుడు నమ్మకం వచ్చిందని ప్రశ్నించారు. రోహిత్రెడ్డికి నందు, సింహయాజీలతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని.. ఆ ముగ్గురి కాల్డేటా బయటకు తీస్తే అన్ని నిజాలు బయటకి వస్తాయన్నారు. రోహిత్రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్హౌజ్.. దళితుల అసైన్డ్ భూమిలో ఉందా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇక, తనకు ఈడీ నోటీసులు ఇవ్వబోతున్నట్టు బండి సంజయ్ కు ముందే ఎలా తెలిసిందంటూ ప్రశ్నించిన రోహిత్ రెడ్డికి ఆన్సర్ ఇచ్చారు రఘునందన్ రావు. ఈడీ కేసును వేగవంతం చేయాలని మాత్రమే బండి సంజయ్ చెప్పారని.. కావాలంటే ఆనాటి బండి సంజయ్ ప్రెస్మీట్ చూసి మాట్లాడాలని కౌంటర్ వేశారు.
మరోవైపు, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై మరో అలగేషన్ కూడా చేశారు రఘునందన్. 2009 ఎన్నికల అఫిడవిట్లో స్వీడన్లో బీటెక్ పూర్తి చేసినట్టు రోహిత్ రెడ్డి తెలిపారని.. కానీ, 2014 ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ఇంటర్ చదివినట్టు ఉందని రఘునందన్రావు ఆరోపించారు. 2009లో ఇంజినీరింగ్ చేసిన వ్యక్తి మళ్లీ 2014లో ఇంటర్ చేస్తాడా అని ఎద్దేవా చేశారు. అధికారులు రోహిత్రెడ్డి బయోడేటా అడగటానికి కారణం ఇదేనంటూ సెటైర్లు వేశారు. భారత ఎన్నికల సంఘానికి రోహిత్రెడ్డి విద్యార్హతపై ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇస్తే అధికారులు కేసులు నమోదు చేస్తారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.