Weather News: ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణానికి సంబంధించి వింత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు చాలా ముందుగానే వచ్చాయి. కొంచెం ముందుగానే వర్షాలు దంచికొట్టాయి. దీంతో ఈ నెల ప్రారంభంలో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీబిజీ అయిపోయారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో రెండు వారాల క్రితమే పత్తిగింజలు పెట్టడం పూర్తి చేశారు. కొందరు నార్లు కూడా పోశారు. మరి కొంత మంది రైతులు పొలాలను ఇప్పుడే చదును చేస్తున్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే గత వారం రోజుల నుంచి మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో రైతులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. పత్తి గింజలు పెట్టి రెండు వారాలు గడుస్తున్నా.. మళ్లీ వర్షాలు పడడం లేదని వరుణ దేవుడి వైపు చూస్తున్నారు. మొదట్లో వర్షాలు దంచికొట్టాయని.. ఇప్పుడేమో ఎండలు కొడుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న రెండు ఉపరితల ఆవర్తనాలు, ద్రోణీ కారణంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వివరించింది. పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని చెప్పింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వివరించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని వివరించింది.
ALSO READ: Watch Video: గుర్రం దగ్గర గెంతులా? వెనక్కి తిరిగి మరీ తన్నిందిగా.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆగదు
రాష్ట్రంలో త్వరగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా.. ఇప్పటి లోటు వర్షపాతమే నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 32.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 25 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. రాష్ట్రంలో 4 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 3 జిల్లాల్లో అధిక వర్షపాతం, 2 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 13 జిల్లాల్లో లోటు వర్షపాతం, 11 జిల్లాల్లో భారీ లోటు వర్షపాతం నమోదైందని అధికారులు వివరించారు. మొత్తానికి రాష్ట్రంలో 23 శాతం తక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 26 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ 19 నాటికి సాధారణ కన్నా ఎక్కువ వర్షపాతం, ఈ నెల 20 నుంచి 26 మధ్య సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ALSO READ: Navodaya: మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం నవోదయ.. అంతా ఫ్రీ.. హైక్వాలిటీ స్టడీ
భారీ వర్షాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని సూచిస్తున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ రెండు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు సూచించారు.