Revanth Reddy: వరంగల్ జిల్లా పరకాల వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణంతో పాటు, మరో రూ.284 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బీఆర్ఎస్ అధినాయకత్వంపై సీఎం రేవంత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఓరుగల్లు పోరాట స్ఫూర్తి.. గత పాలకులకు గుణపాఠం
వరంగల్ ప్రాంతానికి గొప్ప చరిత్ర, పోరాట స్పూర్తి ఉన్నాయని సీఎం కొనియాడారు. ఆచార్య జయశంకర్, దాశరథి వంటి మహనీయులు నడయాడిన ఈ గడ్డ ప్రజా సమస్యలపై ఎప్పుడూ ముందుండి పోరాడుతుందన్నారు. తమను తాము దేవుళ్లుగా భావించి ప్రజలపై ఆధిపత్యం చెలాయించాలని చూసిన గత పాలకులను ప్రజలు గోతి తీసి పాతిపెట్టారని ఎద్దేవా చేశారు. భార్యాభర్తల సంభాషణలను సైతం ట్యాపింగ్ చేసిన వారిని, అధికారమే శాశ్వతమని విర్రవీగిన వారిని ప్రజలు ఓడించి ఇంటికి సాగనంపారని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీకి రండి.. తేల్చుకుందాం!
రాబోయే సెప్టెంబర్లో శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని, ధైర్యముంటే బావాబామ్మర్దులు (కేటీఆర్, హరీష్ రావు) చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. గత ప్రభుత్వం రూ.8.11 లక్షల కోట్ల అప్పులను వారసత్వంగా ఇచ్చిందని, ప్రస్తుతం ఏటా రూ.75 వేల కోట్లు కేవలం అసలు, వడ్డీల రూపంలోనే చెల్లిస్తున్నామని వివరించారు. ఇచ్చి మాట కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధమేనని, ఏడాది పొడవునా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా 24 గంటలు పనిచేస్తున్నానని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు ఎదురైనా అత్యధిక వరి ధాన్యం పండించామని, రైతుల సంక్షేమం కోసం రూ.1.30 లక్షల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.
నిరుద్యోగులు మోసపోవద్దు.. సామాజిక న్యాయమే మా విధానం
ప్రతిపక్షాలు నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి బలితీసుకోవాలని చూస్తున్నాయని సీఎం మండిపడ్డారు. తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం పేరిట నాటకాలు ఆడారని, కేసీఆర్ కుటుంబం ఒక్క బొట్టు రక్తం ఇవ్వకుండా కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘కేసీఆర్ది ఫ్యామిలీ జస్టిస్ అయితే, నాది సోషల్ జస్టిస్’ అని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో ఎవరికి పదవులు దక్కాయో, కాంగ్రెస్ పాలనలో ఎవరికి పదవులు ఇచ్చామో బేరీజు వేసుకోవాలన్నారు. యువత కోసం త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని, రాజకీయ రాక్షసుల మాటలు నమ్మవద్దని కోరారు. దారితప్పిన బండిని పట్టాలెక్కించానని, వెయ్యి మంది కేసీఆర్లు వచ్చినా తమను ఏమీ చేయలేరని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Also Read: డీఎస్పీ భీంరెడ్డికి ఐటీ నోటీసులు.. రూ.200 కోట్ల బినామీ ఆస్తులు జప్తు?