H-CITY Project: స్వేచ్చ బ్యూరో: మహానగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూ రవాణా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటి) ప్రాజెక్ట్ ఇకపై బ్రేకులు లేకుండా ముందుకు సాగనుంది.
ప్రాజెక్ట్ లో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 6 ప్రధాన జంక్షన్లలో 1,090 కోట్ల అంచనా వ్యయంతో 7 మల్టీ-లెవెల్ స్టీల్ ఫ్లైఓవర్లు, 7 డైరెక్షనల్ అండర్పాస్ లతోపాటు మొత్తం 14 నిర్మాణాల పనులు జరుగనున్నాయి. పనులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా శరవేగంగా పూర్తి చేయటానికి ఈ నెల 18వ తేదీ నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. దీనిపై సీపీ వీ.సీ.సజ్జనార్ మాట్లాడుతూ.. వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, నిర్మాణ సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
24 నెలల కాలపరిమితితో రూపుదిద్దుకుంటున్న ఈ హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 6 ప్రధాన జంక్షన్లను రెండు ప్యాకేజీలుగా వర్గీకరించి అభివృద్ధి చేయనున్నారు. ప్యాకేజీ-1లో 3 జంక్షన్లు(జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్, ముగ్ధ జంక్షన్లను డెవలప్ చేస్తారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి క్యాన్సర్ హాస్పిటల్ వైపు వెళ్లే స్ట్రెయిట్ ట్రాఫిక్ కోసం కేబీఆర్ ఎంట్రెన్స్ వద్ద 330 మీటర్ల 2-లేన్ యూని-డైరెక్షనల్ అండర్పాస్ నిర్మించనున్నారు. పంజాగుట్ట నుండి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు రైట్ టర్నింగ్ ట్రాఫిక్ కోసం కేబీఆర్ ఎంట్రెన్స్ వద్ద 900 మీటర్ల 3-లేన్ యూని-డైరెక్షనల్ ఫస్ట్ లెవెల్ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మిస్తారు. కేబీఆర్ ఎంట్రెన్స్ నుండి పంజాగుట్ట వైపు వెళ్లే స్ట్రెయిట్ ట్రాఫిక్ కోసం ముగ్ధ జంక్షన్ వద్ద 260 మీటర్ల 3-లేన్ యూని-డైరెక్షనల్ అండర్పాస్ ను అందుబాటులోకి తెస్తారు.
Also read: తాడిపత్రిలో ఊహించని ఘటన.. నిశ్చితార్థ వేడుకలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాళ్ల దాడి!
రోడ్ నం. 45 జంక్షన్ నుండి కేబీఆర్ ఎంట్రెన్స్, యూసుఫ్గూడ వైపు వెళ్లే స్ట్రెయిట్, రైట్ టర్నింగ్ ట్రాఫిక్ కోసం 740 మీటర్ల వై షేప్ (4/3/2 లేన్) యూని-డైరెక్షనల్ అండర్పాస్ నిర్మిస్తారు. కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ నుండి రోడ్ నెంబర్ 36 వైపు వెళ్లే స్ట్రెయిట్ ట్రాఫిక్ కోసం 745 మీటర్ల 4-లేన్ బై-డైరెక్షనల్ పస్ట్ లెవెల్ స్టీల్ ఫ్లైఓవర్ కడతారు. యూసుఫ్గూడ వైపు నుండి రోడ్ నెంబర్ 45 వైపు వెళ్లే స్ట్రెయిట్ ట్రాఫిక్ కోసం 770 మీటర్ల 2-లేన్ యూని-డైరెక్షనల్ సెకండ్ లెవెల్ స్టీల్ ఫ్లైఓవర్ ను నిర్మిస్తారు.
రోడ్ నంబర్ 45 జంక్షన్ వద్ద ఫిలింనగర్ నుండి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు వెళ్లే స్ట్రెయిట్ ట్రాఫిక్ కోసం 290 మీటర్ల 2-లేన్ యూని-డైరెక్షనల్ అండర్పాస్ అందుబాటులోకి రానుంది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుండి రోడ్ నెంబర్ 45 వైపు రైట్ టర్నింగ్ ట్రాఫిక్ కోసం 500 మీటర్ల 2-లేన్ యూని-డైరెక్షనల్ ఫస్ట్ లెవెల్ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మిస్తారు. ఫిలింనగర్ జంక్షన్ వద్ద మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుండి రోడ్ నెంబర్ 45 వైపు వెళ్లే స్ట్రెయిట్ ట్రాఫిక్ కోసం 430 మీటర్ల 2-లేన్ యూని-డైరెక్షనల్ అండర్పాస్ ఏర్పాటు చేయనున్నారు.
ఫిలింనగర్ వైపు నుండి మహారాజా అగ్రసేన్ వైపు రైట్ టర్నింగ్ ట్రాఫిక్ కోసం 600 మీటర్ల 2-లేన్ యూని-డైరెక్షనల్ ఫస్ట్ లెవెల్ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మిస్తారు. మహారాజా అగ్రసేన్ జంక్షన్ వద్ద బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుండి ఫిలింనగర్ వైపు వెళ్లే స్ట్రెయిట్ ట్రాఫిక్ కోసం 410 మీటర్ల 2-లేన్ యూని-డైరెక్షనల్ అండర్పాస్ రానుంది. ఫిలింనగర్ నుండి రోడ్ నెంబర్ 12 వైపు రైట్ టర్నింగ్ ట్రాఫిక్ కోసం 590 మీటర్ల 2-లేన్ యూని-డైరెక్షనల్ ఫస్ట్ లెవెల్ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మిస్తారు.
Also Read: చంద్రగిరిలో ఏనుగుల రచ్చ.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ నుండి మహారాజా అగ్రసేన్ వైపు రైట్ టర్నింగ్ ట్రాఫిక్ కోసం 330 మీటర్ల 2-లేన్ యూని-డైరెక్షనల్ అండర్పాస్ నిర్మిస్తారు. మహారాజా అగ్రసేన్ నుండి రోడ్ నెంబర్ 10 వైపు వెళ్లే ట్రాఫిక్ కోసం 540 మీటర్ల 2-లేన్ యూని-డైరెక్షనల్ ఫస్ట్ లెవెల్ స్టీల్ ఫ్లైఓవర్ కట్టనున్నారు.
కోర్ సిటీని ఐటీ సాఫ్ట్వేర్ హబ్ తో అనుసంధానించే కేబీఆర్ పార్క్ కారిడార్ నగరంలోనే అత్యంత రద్దీ ఉండే రోడ్డు అని చెప్పవచ్చు. ఉదయం, సాయంత్రం పీక్ హవర్స్లో ఈ మార్గంలో ఉండే వాహనాల రాకపోకల ఒత్తిడిని శాస్త్రీయంగా అంచనా వేసేందుకు ప్యాసింజర్ కార్ యూనిట్స్ పర్ అవర్ ప్రాతిపదికన అధికారులు డేటా సేకరించారు. దీని ప్రకారం ప్రాజెక్టు పరిధిలోని 6 ప్రధాన జంక్షన్లలో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్ గంటకు 15,321 ప్యాసింజర్ కార్ యూనిట్ల రద్దీతో మొదటి స్థానంలో నిలిచింది.
కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ జంక్షన్ గంటకు 13,516 ప్యాసింజర్ కార్ యూనిట్లతో రాకపోకలతో తర్వాతి స్థానంలో ఉంది. ఈ రెండు జంక్షన్లు నిత్యం కిక్కిరిసిపోతూ ప్రధాన బాటిల్ నెక్ లుగా మారాయి. ఇక, మహారాజా అగ్రసేన్ జంక్షన్ 10,356, రోడ్ నంబర్ 45 జంక్షన్ 9,966, ఫిలింనగర్ జంక్షన్ 9,605 ప్యాసింజర్ కార్ యూనిట్లతో నిత్యం ట్రాఫిక్ తో కిటకిట లాడుతున్నాయి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద గంటకు 5,880 ప్యాసింజర్ కార్ యూనిట్లతో రద్దీగా ఉంటోంది.
Also Read: Ms Dhoni: ధోనీ హెల్మెట్పై జాతీయ జెండా ఎందుకు ఉండదు?
పీక్ అవర్స్లో గంటకు 10 వేల నుండి 15 వేలకు పైగా వాహనాలు దాటే ఈ మార్గాల్లో సాధారణ సిగ్నల్ విధానం ద్వారా ట్రాఫిక్ను నియంత్రించడం అసాధ్యం. సిగ్నల్స్ వద్ద నిత్యం వాహనాలు నిలిచిపోతుండటంతో కేబీఆర్ పార్క్ చుట్టూ తీవ్రమైన రద్దీ ఏర్పడుతోంది. ఈ సమస్యలను మూలాల నుంచి నిర్మూలించి ప్రయాణాన్ని సులభతరం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘హెచ్-సిటీ’ ప్రాజెక్టును పట్టాలెక్కించింది.
సీపీ సజ్జనార్ దీనిపై మాట్లాడుతూ మల్టీ-లెవెల్ నిర్మాణాలు పూర్తయితే కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్, రోడ్ నం. 45, ఫిలింనగర్, మహారాజా అగ్రసేన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ల వద్ద వంద శాతం ట్రాఫిక్ సమస్య పరిష్కారమై సిగ్నల్ రహిత రాకపోకలు సాగుతాయన్నారు. అత్యంత రద్దీ ఉండే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద 80శాతం మేర ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. ఫలితంగా కోర్ సిటీ-ఐటీ కారిడార్ మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో పాటు కోట్లాది రూపాయల విలువైన ఇంధనం ఆదా అవుతుందన్నారు.
అంతేకాకుండా జంక్షన్ల వద్ద నిలిచిపోయే వాహనాలు తగ్గడం వల్ల కేబీఆర్ పార్క్ చుట్టూ కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గి పర్యావరణం పరిరక్షించబడుతుందని చెప్పారు. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే వన్-వే విధానం వల్ల తొలి రోజుల్లో వాహనదారులకు కొంత ఇబ్బంది ఎదురుకావచ్చన్నారు. కానీ, పనులను నిర్ణీత వ్యవధిలో శరవేగంగా పూర్తి చేసి భవిష్యత్ తరాలకు సుఖమయమైన ప్రయాణాన్ని అందించడానికే ఈ ఏర్పాటు చేశామన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి వాహనదారులు, స్థానికులు, నగర ప్రజలందరూ పోలీస్ శాఖకు సంపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Also read: అమెజాన్ ప్రైమ్లో ‘డార్క్ సీక్రెట్స్’ హవా.. ఏకంగా నంబర్ 1 ప్లేస్లో!