Telangana Hate Speech Committee: ఒకరి భావప్రకటన స్వేచ్ఛ.. మరొకరి గౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ హేట్ స్పీచ్ సెలెక్ట్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆయన.. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. కులం, మతం, ప్రాంతం, భాష ఆధారంగా ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు సమాజంలో ఉద్రిక్తతలకు దారితీస్తాయని అన్నారు. ఇలాంటి ప్రసంగాల వల్ల శాంతిభద్రతలకు మాత్రమే కాకుండా సామాజిక ఐక్యతకు కూడా నష్టం కలిగే అవకాశం ఉందన్నారు.
అందుకే హేట్ స్పీచ్ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం అన్నారు. చట్టపరమైన అంశాలు, ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు, వాటి అమలులో ఎదురవుతున్న సమస్యలపై క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఈ అంశంలో ప్రజల భావప్రకటన హక్కును గౌరవిస్తూనే ద్వేషాన్ని ప్రోత్సహించే చర్యలను నిరోధించే విధంగా సమతుల్యమైన విధానాన్ని రూపొందించాలన్నారు.
Also Read: ఎర్రకోట పేలుడు వెనుక ‘అల్ ఖైదా’.. ఐరాస భద్రతా మండలి సంచలన నివేదిక!
హేట్ స్పీచ్పై ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ కమిటీ రాజకీయాలకు అతీతంగా, అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలన్నారు. ఎవరైనా ఏ పార్టీకి చెందిన వారైనా, ఏ వర్గానికి చెందిన వారైనా చట్టం ముందు సమానమే అన్న సూత్రాన్ని కాపాడాలన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, సమాజంలో శాంతి, సామరస్యం, పరస్పర గౌరవాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ కమిటీ లక్ష్యమన్నారు.
Also Read: రైల్వే చరిత్రలో ఫస్ట్ టైమ్.. కూల్ డ్రింక్ పేరుతో నడిచే రైలు.. ఇదేదో భలే ఉందే!