ఢిల్లీలో విద్యార్థుల ఫైట్.. వారిపై కేంద్రం దమనకాండ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. జెన్-జీ ఉద్యమానికి సంఘీభావం. కేంద్రం వైఖరి పట్ల నిరసన… బుద్ది జీవులంతా చేస్తున్నదిదే. మేథావులంతా ముక్తకంఠంతో కేంద్రం వైఖరిని ఖండిస్తున్నారు. స్వచ్చంధంగా అన్ని వర్గాలు ముందుకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నాయి.
ప్రతిపక్ష పార్టీలతో సహా, సినీ తారలు కూడా. కానీ తెలుగు చిత్ర సీమ మాత్రం దీనిపై ఇంత వరకు స్పందించలేదు. గప్చుప్గా అన్నీ గమనిస్తోంది. కానీ మౌనాన్నే ఆశ్రయిస్తోంది. దీనిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. టాలీవుడ్లో ఢిల్లీ విద్యార్థి ఉద్యమానికి సంఘీభావం ఎందుకు దొరకడం లేదు..? విద్యార్ధులకు సంఘీభావమంటే.. కేంద్రాన్ని వ్యతిరేకించినట్టే. బీజేపీని విమర్శించినట్టే.. మోడీ విధానాలను ఎండగట్టినట్టే. అందుకే సైలెంట్గా ఉన్నారా? ఎందుకు అంతా మోడీ జపమే చేస్తున్నారా?
తమిళ, కన్నడ, మళయాళ, హిందీ నటులంతా ఒక్కొక్కరికి బయటకు వచ్చి కేంద్రం దమనకాండను తిట్టిపోస్తున్నారు. విద్యార్ధుల భవిష్యత్ కోసం పోరాడుతున్న విధానానికి సపోర్టుగా నిలుస్తున్నారు. మద్దతు పలుకుతున్నారు. కేంద్రానికి సూచన చేస్తున్నారు. హితబోధలు చేస్తూ పద్దతి మార్చుకోవాలంటున్నారు. కానీ ఇప్పటి వరకు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఒక్కరూ బయటకు వచ్చి మాట్లాడింది లేదు.
ఒక్క ప్రకాశ్ రాజ్ తప్ప. ప్రకాశ్ రాజ్ కేవలం తెలుగు సినీ నటుడే కాదు. బహుభాషా నటుడు. అయినా.. తెలుగు రాష్ట్రాల తరపున ఆయన తనదైన శైలిలో గళం విప్పుతూనే ఉన్నాడు. ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ వైఖరినే తూర్పారబట్టడం ద్వారా ..ఆయనను తెలుగు ఇండస్ట్రీ నుంచి బహిష్కరించినంత పని చేసింది టాలీవుడ్.
తెలుగు సినీ ఇండస్ట్రీ అనగానే గుర్తుకొచ్చేది ఏపీనే. అక్కడ్నుంచే హేమాహేమీ నటులంతా ఉన్నారు. సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి.. ఇప్పుడు కాంగ్రెస్ కాదు. ఓరకంగా అనధికారిక బీజేపీ నేతగా చెప్పుకోవాలి. తమ్ముడు పవన్ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామి. డిప్యూటీ సీఎం. పేరుకు జనసేనాని కానీ, బీజేపీ నేతలకు మించి కట్టుబొట్టూ.. వేషధారణతో మోడీ పలుకులే పలుకుతాడు. నిత్యం మోడీ జపమే చేస్తాడు.
అంతేకాదు.. కాక్రోచుల ఉద్యమాన్ని దేశ విచ్చిన్నకారుల ఉద్యమంగా కూడా చెప్పేశాడు. వీరిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని పిలుపునిచ్చాడు. తన సిద్దాంతాలు తను ఓపెన్గా చెప్పేసుకున్నాడు. ఇంత ఓపెన్గా చెప్పిన తరువాత ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా.. జెన్-జీ ఉద్యమానికి సంఘీభావంగా కామెంట్ చేయాలంటే.. చిరంజీవిని, పవన్ కళ్యాణ్లకు వ్యతిరేకంగా వెళ్లినట్టేనని ఇక్కడి తారలు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారనేది తెలిసిపోతూనే ఉంది.
ఇక కూటమి సర్కార్ అంటే.. చంద్రబాబు.. చంద్రబాబు అంటే మళ్లీ బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్.. వీళ్లంతా ఓ జట్టు. మొత్తానికి ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం.. ఇద్దరూ కూటమి సర్కార్లో ఉండి.. మోడీతో దోస్తానా చేస్తూ చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న నేపథ్యంలో.. ఢిల్లీలో బాష్పవాయు గోళాలు ప్రయోగించినా.. రబ్బరు బుల్లెట్లు వాడి రక్తం కళ్ల చూసినా.. ఇక్కడ నుంచి పల్లెత్తు మాట కూడా రాదు. రాబోదు. ఇదీ క్లారిటీ.