Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లక్ష్యంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం దిగిరావాల్సిందేనని స్పష్టం చేస్తూ, బీఆర్ఎస్-బీజేపీల మధ్య ఉన్న గుప్త ఒప్పందాలను ఆయన ఎండగట్టారు.
కేంద్రం దిగిరావాల్సిందే..!
తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ (RRR), మూసీ నది ప్రక్షాళన వంటి ప్రాజెక్టులకు కేంద్రం తక్షణమే అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. వీటితో పాటు రాష్ట్ర రైతులు పండించిన వడ్లు, మొక్కజొన్నలను కేంద్రమే పూర్తిగా కొనుగోలు చేయాలని తేల్చిచెప్పారు. ఈ డిమాండ్లపై ఈ నెల 15 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక ఖచ్చితమైన కార్యాచరణతో ముందుకు వెళ్తామని ఆయన హెచ్చరించారు.
కిషన్ రెడ్డి చీకటి రాజకీయం.. లాలూచీపై ఫైర్!
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కిషన్ రెడ్డి పగటిపూట బీజేపీ ముసుగులో ఉంటూ, చీకటి పడగానే కేటీఆర్, బీఆర్ఎస్ ప్రయోజనాల కోసం లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు రాకుండా కిషన్ రెడ్డే అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
‘కిషన్ రెడ్డి చెప్పడం వల్లే మహారాష్ట్ర ముఖ్యమంత్రి నాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఎందుకని ఆరా తీస్తే.. కిషన్ రెడ్డి అనుమతులు ఇవ్వదన్నాడంటూ ఆఫీస్ నుంచే సమాచారం వచ్చిందని తెలిసింది. ఇదెక్కడి దౌర్భాగ్యపు బుద్ధి?’ అని సీఎం మండిపడ్డారు.
మల్కాజ్గిరి ఒక ‘మినీ ఇండియా’.. నా కొండంత అండ!
మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక ‘మినీ భారతదేశం’గా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. తన రాజకీయ పునర్జన్మకు ఇక్కడి ప్రజలే కారణమని భావోద్వేగంగా పేర్కొన్నారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు మల్కాజ్గిరి ప్రజలు ఎంపీగా గెలిపించి అండగా నిలబడ్డారని, ఆ ధైర్యంతోనే తాను పీసీసీ అధ్యక్షుడినై, సోనియా గాంధీ ఆశీస్సులతో రాష్ట్రంలో ‘ప్రజా ప్రభుత్వం’ ఏర్పాటు చేయగలిగానని రేవంత్ రెడ్డి కృతజ్ఞతగా స్మరించుకున్నారు.
మున్సిపల్ విభజన
ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని మున్సిపాలిటీల విభజనపై వస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి కొట్టిపారేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న CURE ప్రాంతంలో పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే మూడు మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగై సేవలందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ విమర్శలు పూర్తిగా అర్థరహితమని సీఎం తేల్చిచెప్పారు.
Also Read: నీట్ సంక్షోభం కేంద్ర ప్రభుత్వ ‘అట్టర్ ప్లాప్’.. ఆ మంత్రిని తొలగించాల్సిందే- కేటీఆర్