Weather News: తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి వర్షం దంచికొడుతోంది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో కుండపోత వాన కురుస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రేంజ్లో వాన పడింది. సాయంత్రం నుంచి మొదలవుతున్న వర్షం అర్ధరాత్రి 12 గంటల వరకు నాన్స్టాప్గా కురుస్తోంది. మొన్న ముషీరాబాద్లో అత్యధికంగా 18.45శాతం సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. మెయిన్ రోడ్లు మొదలుకుని ఇంటర్నల్ రోడ్ల వరకు ఎక్కడ చూసినా చెరువులను తలపించాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్లతో జనం నరకం చూస్తున్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కూడా ఏర్పడింది.
మరో వారం రోజులు భారీ వర్షాలు
తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని వివరించింది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని చెప్పింది.
ALSO READ: Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!
కాసేపట్లో ఈ జిల్లాల్లో కుండపోత వర్షం..
మరో గంట సేపట్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, ములుగు, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపారు. మెదక్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్పారు. ఇక మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
బయటకు రావొద్దు..!!
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా రైతులు పొలాల వద్దకు వెళ్లొద్దని సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉండడంతో చెట్ల కింద నిలుచోవద్దని చెప్పారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.