Singareni Workers: స్వేచ్ఛ బ్యూరో: ఇప్పటివరకు సింగరేణిలో రూ.కోటి ప్రమాద బీమా పథకాన్ని అమలుచేస్తున్న యూనియన్ బ్యాంక్.., సింగరేణి యాజమాన్యం చేసిన సూచనల మేరకు సహజ మరణం చెందిన కార్మికులకు కూడా ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. యూనియన్ బ్యాంకులో కార్పొరేట్ శాలరీ అకౌంట్ కలిగి ఉన్న కార్మికులు లేదా అధికారులు ఎవరైనా సరే మృతి చెందినట్లయితే వారికి రూ.10 లక్షల బీమా సౌకర్యాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సింగరేణి సంస్థకు బ్యాంకు యాజమాన్యం తెలియజేసింది.
సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి ఆదేశాల మేరకు డైరెక్టర్ పర్సనల్, ఫైనాన్సు గౌతమ్ పోట్రు ప్రత్యేక చొరవ ఫలితంగా యూనియన్ బ్యాంకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇది అమలులోకి రానున్నట్లు బ్యాంకు యాజమాన్యం పేర్కొంది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం చొరవతో సింగరేణి కార్మికులకు ఉచిత కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని యూనియన్ బ్యాంకు అమలు జరిపింది. ఈ ఒప్పందానికి కొనసాగింపుగా సహజ మరణానికి కూడా రూ.10 లక్షల బీమాను వర్తింపజేస్తూ నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
Also read: హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి జోలికెళ్లదు ..?
ఇతర ఇన్సూరెన్స్ కంపెనీల్లో రూ.10 లక్షల బీమా పాలసీ తీసుకోవాలంటే కనీసం రూ.5 వేలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే సింగరేణి యాజమాన్యం తీసుకున్న ప్రత్యేక చొరవ వల్ల ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా యూనియన్ బ్యాంకు సహజ మరణానికి రూ.10 లక్షల బీమా పథకాన్ని అమలుచేస్తోంది. కాగా సింగరేణి సంస్థలో రూ.కోటి ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని అమలు జరుపుతున్న ఇతర బ్యాంకులు కూడా ఇదే విధంగా సహజ మరణానికి కూడా బీమా సౌకర్యాన్ని వర్తింపజేసేలా సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకుంటోంది.
Also read: ట్రాన్స్ జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగు.. సర్కార్ భారీ ప్లాన్..?