Srinivas Goud: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సెక్యూరిటీ ఉపసంహరణ వివాదం రాజుకుంది. బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని స్పష్టమవుతోందని, ఈ అసహనంతోనే ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతపై ఆందోళన
మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు భద్రతను తొలగించడంపై శ్రీనివాస్ గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత కాంగ్రెస్ హయాంలోనే ఆయన అత్యంత సమర్థవంతంగా పనిచేశారని గుర్తుచేశారు. ఆయన విధి నిర్వహణ శైలి కారణంగానే ప్రస్తుతం ఆయనకు ప్రాణహాని (త్రెట్) ఉందన్నారు. ప్రవీణ్ కుమార్ బతికినంత కాలం ఆయనకు భద్రత కల్పించాలని గతంలో ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ఇచ్చాయని స్పష్టం చేశారు. అలాంటిది ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల కోసం పోరాడుతున్న ఆయనకు సెక్యూరిటీని పెంచాల్సింది పోయి, పూర్తిగా తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.
Also Read: తుంగభద్ర నీటిపై రేవంత్ రెడ్డికి బీజేపీ షాక్.. ఆ 15.9 టీఎంసీల కథేంటి?
రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి మండిపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు)కు విరుద్ధంగా ప్రవీణ్ కుమార్ సెక్యూరిటీని తీసేశారని విమర్శించారు. అలాగే, ప్రాణహాని ఉన్న అధికారులకు రక్షణ కల్పించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు) స్పష్టం చేస్తోందని, కానీ కాంగ్రెస్ సర్కార్ ఈ నిబంధనలను బేఖాతరు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ డిమాండ్
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు తక్షణమే కొత్త వాహనాన్ని కేటాయించడంతో పాటు, అదనపు సెక్యూరిటీని పెంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. విపక్ష నేతల భద్రత విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా నడుచుకోవాలని ఆయన హితవు పలికారు.