Bhadrachalam Ramayya Kalyanam(Today news in telangana): దేశమంతా శ్రీరామనవమి వేడుకలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఊరు, వాడా రామయ్య కల్యాణ సంబరాలు జరుపుకుంటున్నారు భక్తులు. జగదభిరాముడు, సత్యహరిశ్చంద్రుడైన రాముడు.. సీతమ్మవారి మెడలో మూడుముళ్లు వేసే ఆ ఘడియ వచ్చేసింది. అటు అయోధ్యలో, ఇటు భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో రాములవారి కల్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి.
సీతమ్మ సమేతంగా రాములవారు మిథిలా వేదికపై కొలువుదీరగా.. సీఎస్ శాంతకుమారి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. మిథిలా ప్రాంగణమంతా జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగింది. సరిగ్గా 12 గంటలకు రామచంద్రుడు సీతమ్మ తలపై, సీతమ్మ రాములవారి తలపై జీలకర్ర బెల్లం పెట్టడంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో రాములవారు మూడు ముళ్లూ వేశారు. ఈ కల్యాణాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంతో పులకించిపోయారు.
ఈ ఏడాది భద్రాద్రి రామయ్య కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ బ్రేక్ వేయడంతో భక్తులంతా ఆందోళన చెందారు. భద్రాచలం వెళ్లి నేరుగా కల్యాణం చూడలేని భక్తులంతా ఏటా ప్రత్యక్ష ప్రసారం ద్వారానే కల్యాణాన్ని వీక్షించి తరిస్తారు. ఇది చాలా సెంటిమెంట్ తో కూడుకున్న విషయం.
Also Read : బాలరాముడికి సూర్యతిలకం.. దర్శనమివ్వనున్న మహత్తర దృశ్యం
ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని, ఎలక్షన్ కోడ్ నుంచి దీనికి మినహాయింపు ఇచ్చి.. ప్రత్యక్షప్రసారానికి పర్మిషన్ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ రాసిన లేఖపై ఈసీ స్పందించింది. సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో భక్తులంతా టీవీలు, స్మార్ట్ ఫోన్లలో రామయ్య కల్యాణోత్సవాన్ని తిలకించారు.