Telangana Assembly: స్వేచ్ఛ బ్యూరో: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 30వరకు జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర 3 శాసనసభ 8వ సమావేశాల నేపధ్యంలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సోమవారం శాసనసభ భవనంలోని స్పీకర్ చాంబర్ లో అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరి కమిటీ (బీఏసీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. మంగళవారం(ఈనెల17న), బుధవారం(ఈ నెల18న) గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చజరుగనుంది. బుధవారం క్వాశ్చర్ అవర్ సైతం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈనెల 19న ఉగాది ఉండటంతో సెలవు. ఈనెల 20న అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. 21న రంజన్, 22న ఆదివారం. ఈనెల 23 నుంచి 26 వరకు బడ్జెట్పై చర్చించనున్నారు.
27న శ్రీరామనవి సెలవు. 28న వక్ఫ్ బోర్డు బిల్లు, జీహెచ్ ఎంసీ న్యూ యాక్ట్ క్యూర్, రేర్, ప్యూర్ యాక్ట్ , మూసీ ప్రక్షాళనపై స్పెషల్ డిస్కషన్ పెట్టబోతున్నట్లు సమాచారం. 29 ఆదివారం కావడంతో సభ నిర్వహణపై స్పష్టత రాలేదని సమాచారం. 30న ద్రవ్య వినిమియ బిల్లును ప్రవేశపెట్టి చర్చ చర్చ జరగనుంది. అదేరోజూ బిల్లును ఆమోదించనున్నారు. సభను నిరవధిక వేయబోతున్నట్లు సమాచారం. ఇదెలా ఉంటే 31న సైతం అసెంబ్లీ నిర్వహించాలని ప్రతిపక్షాలు బీఏసీలో ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదని సమాచారం. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, విప్ బీర్ల ఐలయ్య , బీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు, కేపీ వివేక్ నందగౌడ్, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి కౌసర్ మొహిద్దీన్, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, శాసనసభ కార్యదర్శి ఆర్.తిరుపతి పాల్గొన్నారు.
హౌస్ కమిటీలు ఆలస్యం అయ్యాయి, ఆ కమిటీలు వేయాలని కోరగా వేస్తామని హామీ ఇచ్చారని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ నెల 30వరకు అసెంబ్లీని నడుపుతామని ప్రభుత్వం చెప్పిందన్నారు. ఆదివారాలు అసెంబ్లీ పెట్టాలని బీఏసీలో కోరామని, కనీసం మార్చి 31 వరకు సభ పెట్టాలని కోరామన్నారు. సీఎంతో మాట్లాడి చెప్తామని అన్నారని, 20న బడ్జెట్, 22 వ తేదీ ఆదివారం అసెంబ్లీ ఉంటుందని తెలిపారు. అసెంబ్లీలో మంగళవారం క్వశ్చన్ అవర్ లేకపోవడంతో ఉండాలని కోరామన్నారు. అన్ స్టార్డ్ క్వశ్చన్స్,జీరో అవర్ ప్రశ్నలకు సమాధానం ఇప్పటి వరకు రాలేదని పేర్కొనగా ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆరు గ్యారెంటీల అమలుపై ప్రయివేటు మెంబర్ బిల్లుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కోరామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఇద్దరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
మేము మాట్లాడుతుంటే సీఎం,సంబంధిత శాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి మాత్రమే మాట్లాడాలని చెప్పామన్నారు. సీఎంపై బిఆర్ఎస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ ఇస్తే పట్టించుకోవడం లేదని స్పీకర్ కు చెప్పామన్నారు. అసెంబ్లీ లైబ్రరీ పరిస్థితి దారుణంగా ఉందని బీఏసీలో ప్రభుత్వానికి చెప్పామని, బీఏసీ మినిట్స్ ఫాలో కాకపోతే వచ్చే బీఏసీని బాయ్ కాట్ చేస్తామని చెప్పామన్నారు. అసెంబ్లీని ఉదయం 9 గంటలకు పెట్టాలని డిమాండ్ చేశామన్నారు. ఇప్పటి వరకు డిప్యూటీ స్పీకర్ ను పెట్టలేదని , ప్రివిలేజ్ మోషన్స్ తీసుకునేది డిప్యూటీ స్పీకర్ అన్నారు. ప్రివిలేజ్ మోషన్స్ విషయంలో స్పీకర్ భాద్యత తీసుకోవాలని కోరామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ ను పిలువలేదని తెలిపారు. 19 అంశాలపై చర్చించాలని బీఏసీలో స్పీకర్ ను కోరినట్లు తెలిపారు.
బడ్జెట్ పై సమగ్రంగా చర్చించాలని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరారు. అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 31 వరకు నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. ప్రివిలేజ్ కమిటీలు వేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు బడ్జెట్ లో ఎన్ని నిధులు కేటాయించారనేది స్పష్టంగా వివరించాలన్నారు. గత బడ్జెట్ లో ఎన్ని నిధులు కేటాయించారు.. ఎన్ని నిధులు విడుదలచేశారు అనేదానిపైనా చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను 20రోజులైనా నిర్వహించాలని కోరారు.
Also Read: Assembly Security: అసెంబ్లీ సెక్యూరిటీ స్టాఫ్ పై మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్..!