Sandeep Kumar Sultania: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కేటాయించాల్సిన బకాయి నిధుల విడుదల వ్యవహారంలో తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో నమోదైన కోర్టు ధిక్కరణ కేసులో, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా శుక్రవారం హైకోర్టులో జస్టిస్ నగేష్ భీమపాక సమక్షంలో హాజరయ్యారు.
అరెస్ట్ వారెంట్ నుండి కోర్టు హాజరు వరకు..
2024లో ఇచ్చిన ఆదేశాలను బకాయిల విడుదల విషయంలో ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని రామకృష్ణ అనే వ్యక్తి ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సందీప్ సుల్తానీయాను ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేసి తీసుకురావాలని నిన్న హైదరాబాద్ సీపీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రూ. 5,000 పూచికత్తు, పర్సనల్ బాండ్తో బెయిల్ పొందిన ఆయన, శుక్రవారం కోర్టుకు హాజరవుతానని హామీ ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు ఆయనను ఎస్కార్ట్ చేస్తూ న్యాయస్థానానికి తీసుకువచ్చి, ఆ వివరాలను సమర్పించారు.
రైతు బంధు పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సందీప్ సుల్తానీయాపై ఇలాంటివి వెయ్యి కేసులు ఉన్నాయి, అవన్నీ విచారిస్తే జీవితకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ప్రభుత్వాలు చేసే తప్పుల వల్ల అధికారులకు ఈ పరిస్థితి రావడం బాధాకరం’ అని వ్యాఖ్యానించింది.
ఉచిత పథకాలు సమాజానికి నష్టమని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ‘రైతు బంధు పథకాన్ని సంపన్నులు, ఐఏఎస్ అధికారులు, కోటీశ్వరులు కూడా తీసుకుంటున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. సమాజంలో ఎవరికీ బాధ్యత లేదా?’ అని ప్రశ్నించింది.
ఆగస్టు 19కి విచారణ వాయిదా
కంటోన్మెంట్ నిధుల చెల్లింపు ప్రక్రియ ఇప్పటికే సగం పూర్తయిందని, మిగిలిన బకాయిలను ఇన్స్టాల్మెంట్ రూపంలో విడుదల చేస్తామని సుల్తానీయా కోర్టుకు విన్నవించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలపడంతో, ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 19వ తేదీకి వాయిదా వేసింది.
Also Read: ఓఆర్ఆర్ కాంట్రాక్టర్లపై సీఎం ఫైర్.. అధికారులకు ఆ రూల్స్ తప్పనిసరి!