TPCC Media: స్వేచ్ఛ బ్యూరో: టీపీసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం స్టేట్ చైర్పర్సన్గా భువనగిరి లోక్సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఈ పదవిలో నియమిస్తున్నట్లు ఎసిసి జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ తెలిపారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఏఐసీసీ స్పష్టం చేసింది.
తెలంగాణ కాంగ్రెస్లో కీలక నియామకం..
ఇక యువ నాయకుడిగా, భువనగిరి లోక్సభ నియోజకవర్గ ప్రతినిధిగా ప్రజా సమస్యలపై పార్లమెంట్లోనూ, బహిరంగ వేదికలపైనూ నిరంతరం స్వరం వినిపిస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డికి మీడియా అండ్ పబ్లిసిటీ రంగాన్ని పర్యవేక్షించే అత్యంత కీలకమైన బాధ్యతలను ఏఐసీసీ అప్పగించింది.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను, పార్టీ విధానాలను మీడియా ద్వారా పారదర్శకంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలోనూ, మీడియా రంగానికీ – పార్టీకి మధ్య సమర్థవంతమైన సమన్వయం సాధించడంలోనూ కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తారని పార్టీ భావిస్తోంది.
కాంగ్రెస్ అధిష్టానానికి, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు..
తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానానికి, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ నాయకత్వానికి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్లకు చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ సిద్ధాంతాలను, ప్రభుత్వ ప్రజా సంక్షేమ ఫలాలను నిరంతరం మీడియా వేదికగా ప్రజలకు చేరవేస్తూ, టీపీసీసీ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియా కమిటీ చైర్మన్గా నియామకం కావడం పట్ల పలువురు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీపీసీసీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
సోషల్ మీడియా విభాగాలకు కొత్త కమిటీలు నియామకం..
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పరిధిలోని మీడియా, పబ్లిసిటీ విభాగంతో పాటు సోషల్ మీడియా రంగానికి సంబంధించి నూతన కమిటీలను కాంగ్రెస్ అధిష్టానం గురువారం ప్రకటించింది. సోషల్ మీడియా డిపార్ట్మెంట్ కాంగ్రెస్ చైర్పర్సన్ గా నవీన్ పెట్టం,కన్వీనర్లుగా ఉజ్వల్ రెడ్డి కర్ల, వంశీ కృష్ణ పెండ్యాల, కోఆర్డినేటర్లుగా శివకుమార్ అంబాల, విష్ణువర్ధన్ రెడ్డి, రామ్ లక్ష్మణ్ వీరాపురం ,గీత ఐనాల,ఎండీ ఆబిద్ అలీ, సుశీల్ కుమార్ లు,కో-కోఆర్డినేటర్లుగా భార్గవ్ నాయుడు మంజు దినేష్ ,ఫరీద్ ఉద్దీన్ లు నియమితులయ్యారు.
Also Read: మీ భూమి ORR పరిధిలో ఉందా? HILTP ఆన్లైన్ పోర్టల్ మళ్లీ ఓపెన్.. డెడ్లైన్ ఎప్పుడంటే?