Telangana Police: స్వేచ్ఛ బ్యూరో: పోలీసింగ్ లో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ పోలీసులు మావోయిస్టుల విషయంలోనూ నెంబర్ వన్ ఫలితాలను సాధించారు. సంయమనం సహనంతో రెండేళ్లపాటు సుధీర్ఘ వ్యూహాన్ని అమలు చేసి వందల సంఖ్యలో మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలిపారు. ఇప్పటికీ అవకాశం ఉంది. అజ్ఞాతం వీడి జనంలోకి రండి. ప్రభుత్వం కల్పించిన పునరావాస పథకాల ప్రయోజనాలను పొందండి అంటూ పిలుపు ఇస్తూనే ఉన్నారు. మావోయిస్టు పార్టీ ఉనికి లేకుండా చేయటానికి కేంద్ర ప్రభుత్వం 2019 నుంచే చర్యలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోని అడవుల్లో బేస్ క్యాంపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఈ ప్రణాళిక అమలును ప్రారంభించింది. ఇక, 2024, జనవరి 1న ఆపరేషన్ కగార్(Operation Kagar) ను ప్రారంభించిన కేంద్రం 2026, మార్చి 31వ తేదీలోపు మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతం చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా వేలాది సంఖ్యలో భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. వారి చేతికి అత్యంత అధునాతన ఆయుధాలతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందచేసింది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ఎన్ కౌంటర్లు జరిగాయి. పెద్ద సంఖ్యలో మావోయిస్టు పార్టీ నేతలతోపాటు క్యాడర్ నేలకొరిగింది.
మిగితా రాష్ట్రాల్లో మావోయిస్టులపై దమన నీతిని ప్రయోగించగా తెలంగాణ పోలీసులు(Telangana Police) ఇక్కడ దానికి పూర్తి భిన్నమైన వ్యూహాన్ని అమలు చేశారు. ఆపరేషన్ కగార్ లో భాగంగా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఎక్కడా తలొగ్గ లేదు. బుల్లెట్ కు బుల్లెట్టే సమాధానం కాదు అన్న విధంగా ముందుకు సాగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జనజీవన స్రవంతిలో కలిసి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ మావోయిస్టులకు ఇచ్చిన పిలుపు మేరకు ఏళ్ల తరబడిగా అజ్ఞాతంలో ఉన్న వారిని ప్రజా క్షేత్రంలోకి ఆహ్వానించారు. మావోయిస్టుల కట్టడి కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ)లో సుధీర్ఘకాలం పని చేసిన అనుభవం ఉన్న ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి, ప్రస్తుతం ఆ విభాగంలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న సుమతి దీని కోసం ధీర్ఘకాల వ్యూహాన్ని అమలు చేశారు.
Also Read: MP DK Aruna: దమ్ముంటే కామారెడ్డి చౌరస్తాకు రండి.. ఎంపీ డీకే అరుణ సవాల్..?
ఆపరేషన్ కగార్ జోరుగా అమలవుతున్న వేళ తమదైన శైలిలో వ్యవహరించారు. లొంగిపోతే అన్ని రకాలుగా అండగా ఉంటాం ప్రభుత్వం కల్పించిన పునరావాస పథకాల ప్రయోజనాలు అందేలా చూస్తామన్న నమ్మకాన్ని మావోయిస్టుల్లో కల్పించారు. లొంగిపోయిన వారికి తక్షణ సహాయం అందచేయటంతోపాటు వారి పేరన ఉన్న రివార్డుల మొత్తాన్ని వారికే అందించారు. జీవితంలో స్థిరపడటానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందచేశారు. ఓవైపు నుంచి కేంద్రం నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి వచ్చినా ఎక్కడా సంయమనం కోల్పోలేదు. ఈ క్రమంలో గడిచిన రెండేళ్లలో 6వందల మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే సరెండర్ అయిన వారిలో 90శాతం మందికి పైగా మావోయిస్టులు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన వారు ఉండటం. మావోయిస్టుల్లో రాష్ట్ర పోలీసులు ఎంతగా నమ్మకం కల్పించారో దీనిని బట్టే స్పష్టమవుతుందని అధికారులు అంటున్నారు.
హింసకు ప్రతిహింస సమాధానం కాదన్నది దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మాగాంధీ చెప్పిన మాట. సరిగ్గా దీనిని ఆచరణలో చూపించారు మన రాష్ట్ర పోలీసులు. తాజాగా సరెండర్ అయినట్టుగా చెబుతున్న తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, నూనె నరసింహా రెడ్డి ఎలియాస్ గంగన్న తదితరుల సరెండర్ ను ఆపరేషన్ ఆమ్మెస్టీ పేర చూపించబోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీపుల్స్ వార్ పేర ప్రారంభమైన ఉద్యమానికి సాఫ్ట్ ఆపరేషన్ ద్వారా తెలంగాణ పోలీసులు గౌరవమైన ముగింపు ఇవ్వటంపై కేంద్రం నుంచి ప్రశంసలు అందినట్టుగా తెలిసింది.