CPI Crisis: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ఒకప్పుడు ప్రజా సమస్యలపై ఉప్పెనలా ఎగసిన ఎర్రజెండా.. ఇప్పుడు అంతర్గత అసంతృప్తితో కునారిల్లుతోంది! సీపీఐ రాష్ట్ర నాయకత్వ వైఖరి, ముఖ్యంగా రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శైలిపై కేడర్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర నాయకుడిగా అందరినీ కలుపుకుపోవాల్సిన ఆయన, కేవలం తన సొంత వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. అటు ఎమ్మెల్యేగా, ఇటు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా రెండు కీలక పదవుల్లో ఉన్న కూనంనేని.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాల్సింది పోయి, కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాకే పరిమితం అవుతున్నారని ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర నాయకత్వ వైఖరిపై క్షేత్రస్థాయి కేడర్ తీవ్ర ‘గుస్సా’తో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వ్యక్తి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలి. కానీ, కూనంనేని వ్యవహారశైలి చూస్తే ఆయన కేవలం కొత్తగూడెం నియోజకవర్గానికే పరిమితమైనట్లు కనిపిస్తోందని పార్టీ వర్గాలే విమర్శిస్తున్నాయి. చివరికి ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆయన తన సొంత నియోజకవర్గ పరిధి దాటి బయటకు రాలేకపోయారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మిగిలిన జిల్లాల్లో అభ్యర్థులకు కనీస ప్రచారం, నాయకత్వ భరోసా కరువై సీపీఐ తీవ్రంగా నష్టపోయిందని పార్టీ నేతల్లోనే చర్చజరిగింది.
Also read: సీఎం రేవంత్ కర్ణాటక పర్యటన.. కవిత సంచలన వ్యాఖ్యలు!
ఒక చేత్తో ఎమ్మెల్యే పదవి.. మరో చేత్తో రాష్ట్ర కార్యదర్శి పీఠం. ఈ రెండు పదవులను ఒకే వ్యక్తి కి ఉండటం వల్లనే రాష్ట్ర పార్టీకి నష్ఠం జరుగుతుందనే చర్చపార్టీలో జరుగుతుంది. జిల్లాల్లో కేడర్ను పట్టించుకునే నాథుడే లేడని సమాచారం. ఒక నియోజకవర్గానికే పరిమితం కావాలనుకుంటే రాష్ట్ర కార్యదర్శి పదవి ఎందుకు అనే ప్రశ్నలు కేడర్ లో ఉత్పన్నమవుతున్నాయి. జిల్లాలో పార్టీకి కార్యదర్శులు ఉన్నప్పటికీ వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతుంది. ఆయన చెప్పినవారికే.. కేవలం సొంత అనుచర వర్గానికే ప్రియార్టీ ఇస్తున్నారని దీంతో పార్టీకి నష్టం జరుగుతుందనే చర్చ పార్టీలో మొదలైంది. సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు అయిన చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డికి సైతం తగిన గుర్తింపు పార్టీలో లేదనే చర్చ జరుగుతుంది.
ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసే సీపీఐ, గత కొంతకాలంగా సైలెంట్ ఉండటాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తాండవిస్తున్నా, పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి కార్యాచరణ రాకపోవడంతో కేడర్లో నైరాశ్యం అలుముకుంది. కేవలం సొంత వర్గాన్ని కాపాడుకునేందుకే ప్రాధాన్యత ఇస్తూ, ప్రజా క్షేత్రాన్ని విస్మరిస్తున్నారని పార్టీలో చర్చజరుగుతుంది. కేవలం అడపా దడపా ప్రెస్ మీట్లు, ఇటీవల హనుకొండలో పేదల ఇళ్ల కూల్చివేతపై స్పందన మాత్రమే ఆశించిన స్థాయిలో ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం తన తీరు మార్చుకుని, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటుందా? లేదా ? అనేది చూడాలి. కేంద్ర పెద్దలు జోక్యం చేసుకుని రాష్ట్ర పార్టీని కాపాడకపోతే, తెలంగాణలో సీపీఐ ఉనికి లేకుండా పోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also read: మీరు తాగుతున్న పాలలో డిటర్జెంట్ ఉందా? కల్తీ పాలను ఇలా చెక్ చేయండి