Fertility Centres: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ ఫర్టిలిటీ (సంతానోత్పత్తి) కేంద్రాల నియంత్రణపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐవీఎఫ్, ఏఆర్టీ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు చేయడంతో పాటు కఠినమైన ఆడిటింగ్కు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం నుంచి అందిన అత్యవసర ఆదేశాలతో వైద్యారోగ్య శాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది. ట్రీట్మెంట్ నుంచి మెడిసిన్ పంపిణీ వరకు అంతా మానిటరింగ్ చేసేందుకు వైద్యారోగ్యశాఖ ప్రిపేర్ అవుతున్నది.
సంతానలేమితో బాధపడుతున్న దంపతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని, కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్లు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు వైద్యారోగ్య శాఖ రంగంలోకి దిగింది. ఈమేరకు ప్రతీ జిల్లాలో జిల్లా వైద్యాధికారి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీలను రంగంలోకి దించారు. ఈ కమిటీల్లో గైనకాలజిస్టులు, ఎంబ్రియాలజిస్టులు, లీగల్ సెల్ ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. వీరు ఏ క్షణంలోనైనా ఏ ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్నైనా తనిఖీ చేసే పూర్తి అధికారులను ప్రభుత్వం కేటాయించే ఛాన్స్ ఉన్నది.
గతంలో లాగా కేవలం ఏడాదికి ఒకసారి చూసి వెళ్లే పద్ధతికి ప్రభుత్వం స్వస్తి పలికింది. ప్రస్తుతం ప్రతీ సెంటర్లో రోజువారీగా ఎన్ని ఓపీడీ కేసులు వస్తున్నాయి.? ఎంతమందికి ఐవీఎఫ్, ఐయూఐ ప్రక్రియలు ప్రారంభించారు? ఎంబ్రియో (పిండం) నిల్వలు ఎన్ని ఉన్నాయి? లాంటి వివరాలపై ప్రతిరోజూ వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ‘స్క్రీనింగ్’ జరుగుతోంది. ఏ రోజుకారోజు రిపోర్టులలో ఏ చిన్న తేడా ఉన్నా వెంటనే నోటీసులు జారీ చేస్తున్నారు.
Also Read; Hyderabad Metro: ఢిల్లీ కేంద్ర మంత్రులకు.. సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!
మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల ప్రకారం ప్రతీ ఫర్టిలిటీ సెంటర్ తమ వివరాలను అధికారిక పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం నియమించే కమిటీలు పోర్టల్లోని ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లను, నేరుగా హాస్పిటల్కు వెళ్లి అక్కడ ఉన్న ఒరిజినల్ రికార్డులను (ఫిజికల్ వెరిఫికేషన్)చెక్ చేయనున్నారు. అంతేగాక రోగుల ఆధార్ కార్డులు, వారి సమ్మతి పత్రాలుపక్కాగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేస్తున్నారు.
ఈ ఆడిట్లో ప్రధానంగా ఐదు అంశాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో వాడే హార్మోన్ ఇంజెక్షన్లు, మెడిసిన్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు? వాటికి అధిక ధరలు వసూలు చేస్తున్నారా? ఎక్స్పైరీ డేట్ ముగిసిన మందులు వాడుతున్నారా? అనే దానిపై డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి చెక్ చేస్తున్నారు.మరోవపు దంపతులకు అవసరం లేకపోయినా అనవసరమైన ల్యాబ్ టెస్టులు, ఖరీదైన ఐవీఎఫ్ ప్రక్రియలను బలవంతంగా రుద్దుతున్నారా ? అనే కోణంలో కేసు షీట్లను పరిశీలిస్తున్నారు.క్లినిక్లలో గుర్తింపు పొందిన, అనుభవజ్ఞులైన ఎంబ్రియాలజిస్టులు, గైనకాలజిస్టులు ఉన్నారా? లేక నకిలీ సర్టిఫికెట్లతో నడుపుతున్నారా? అనే అంశాలనుకూడా ఈ కమిటీలు పర్యవేక్షించనున్నారు.
మరోవైపు సరోగసీ (గర్భం అద్దెకు ఇవ్వడం) చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్నారా? ఎగ్ డోనర్స్ (అండదాతలు) విషయంలో నిబంధనలు పాటిస్తున్నారా? ఐవీఎఫ్ ల్యాబ్లలో మెయింటైన్ చేయాల్సిన ఉష్ణోగ్రత,పరిశుభ్రత అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉన్నాయా? అనే అంశాలను ఎప్పటికప్పుడు చెక్ చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో సచివాలయం నుంచి జిల్లా కేంద్రాల వరకు అధికారులలో తీవ్ర కదలిక వచ్చింది. తనిఖీలలో అలసత్వం వహిస్తే సదరు అధికారులపైనే చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించడంతో, డీఎమ్హెచ్ఓలు స్వయంగా ఫీల్డ్లోకి దిగారు. అనుమతులు లేని, నిబంధనలు ఉల్లంఘించిన కొన్ని సెంటర్లకు ఇప్పటికే సీళ్లు వేయడం, భారీ జరిమానాలు విధించడం వంటి చర్యలు చేపట్టారు.
Also read: హైదరాబాద్లో ‘సర్’ అస్తవ్యస్తం.. పది రోజులు గడిచినా అందని ఓటరు ఫారాలు!