HCA Scam: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అక్రమాలకు అడ్డాగా మారిన హెచ్సీఏను రద్దు చేయటంతోపాటు నకిలీ సొసైటీ, ఎన్నికల రిగ్గింగ్, టీజీ20 వేలం స్కాంపై సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. అసలు, హెచ్సీఏ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయాలని ప్రశ్నించింది. టీసీఏ ప్రధాన కార్యదర్శి దారం గురువారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ వంద కోట్ల రూపాయల టీజీ20 నిధులను మళ్లించటానికి హెచ్సీఏ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. బీసీసీఐ అనుమతి లేకుండా, చట్టవిరుద్ధంగా టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ ను హెచ్సీఏ ఎలా ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు.
ఫోర్జరీ, టీజీ20 ఫ్రాంచైజీల వేలం జరుపుతూ హెచ్సీఏ క్రికెట్ ను అభివృద్ది చేయటం లేదని కార్టెల్ మాఫియాలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హెచ్సీఏలో జరిగిన అక్రమాలపై సీఐడీలో ఇప్పటికే కేసులు నమోదై ఉన్నట్టు చెప్పారు. 2025, జూలై 9న ఈ కేసులో అరెస్టులు కూడా జరిగాయన్నారు. హెచ్సీఏ పనితీరును పర్యవేక్షించటానికి హైకోర్టు జూలై నుంచి రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావును నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా, పాలనా నియమాలను బేఖాతరు చేస్తూ అక్రమ కమిటీలు, నియామకాలు, ఆర్థిక నిర్ణయాలను హెచ్సీఏ తీసుకుంటోందని చెప్పారు.
ఆక్స్ ఫర్ద్ బ్లూస్ క్రికెట్ క్లబ్ కు సంబంధించి ఓ షాకింగ్ మోసం వెలుగు చూసినట్టు చెప్పారు. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకే పేరుతో రెండు సొసైటీలు నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. హెచ్సీఏ ఓటర్ల జాబితాను తారుమారు చేయటానికే నకిలీ సొసైటీ గుర్తింపును ఉపయోగించారన్నారు. ఈ క్లబ్ కు ప్రాతినిధ్యం వహించిన ఎం.జీవన్ రెడ్డి కేవలం నాలుగు నెలల్లోనే హెచ్సీఏ గౌరవ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎలా ఎన్నికయ్యారని ప్రశ్నించారు. దీనినిబట్టే ఫోర్జరీ, మాల్ ప్రాక్టీస్, క్లబ్ గుర్తింపును మోసపూరితంగా మార్చారన్న విషయం స్పష్టమవుతోందని చెప్పారు.
Also read: పంటి నొప్పితో నరకం చూస్తున్నారా? నిమిషాల్లో తగ్గించే చిట్కాలు ఇవే!
ఆ వెంటనే సుప్రీం కోర్టు ఆమోదం ఉన్న బీసీసీఐ రాజ్యాంగంలోని 28 రూల్ ను ఉల్లంఘిస్తూ ఆగమ్ రావు ఆధ్వర్యంలో టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ ను అక్రమంగా ఏర్పాటు చేశారన్నారు. డబ్బు కొల్లగొట్టటానికి ప్రస్తుతం హెచ్సీఏ టీజీ20 ఫ్రాంచైజీలను 3 నుంచి 10కోట్ల రూపాయలకు వేలం వేయటానికి కుట్రలు చేస్తోందన్నారు. తద్వారా 100 కోట్లకు పైగా టర్నోవర్ ను సాధించి థర్డ్ పార్టీ హక్కులను సృష్టించి నిధులను దారి మళ్లించటానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.
టీజీ20 రికార్డులను జప్తు చేయటంతోపాటు ఖాతాలను ఫ్రీజ్ చేయటానికి తక్షణ చర్యలు చేపట్టాలని సీఐడీకి ఫిర్యాదు ఇవ్వనున్నట్టు తెలిపారు. సీనియర్ క్రికెటర్లు ఎంతోమంది ఉండగా అంబటి రాయుడును క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ గా నియమించారన్నారు. పదవి చేపట్టగానే అంబటి రాయుడు తన స్నేహితునికి పగడాల నిరంజన్ ను కమిటీలో నియమించుకున్నారన్నారు. నిజానికి నిరంజన్ 8వ్యూస్ అనే ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలో భాగస్వామి అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. అంబటి రాయుడు, జీవన్ రెడ్డి చేతులు కలిపి అర్హత లేని సెలెక్షన్ కమిటీలను ఏర్పాటు చేసి మొత్తం వ్యవస్థనే హైజాక్ చేశారని దుయ్యబట్టారు. సీఐడీ విచారణ జరుగుతున్నా, హైకోర్టు నియమించిన ఏకసభ్య జస్టిస్ కమిటీ ఉన్నా హెచ్సీఏ అన్ని చట్టాలను ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు.
Also Read: తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం..?
కామంటేటర్ గా ఉన్న టీ.సుమన్ ను హెచ్సీఏ సెలెక్టర్ గా నియమించారని చెప్పారు. ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఓపెన్ సెలెక్షన్ కోసం క్రికెటర్లను ప్రకటించటం అవినీతికి ద్వారాలు తెరిచిందని పేర్కొన్నట్టు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఆకాశ్ భండారి జూనియర్స్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఉన్నారని చెప్పారు. సెక్రటరీ జీవన్ రెడ్డితో కలిసి పేరూ ఊరు లేని అయిదుగురు క్రికెటర్లను హెచ్సీఏ నిధులతో ముంబయిలోని వెంకట్రావు నడుపుతున్న ప్రైవేట్ అకాడమీ ద్వారా ఇంగ్లండ్ పర్యటనకు పంపిస్తున్నారని చెప్పారు. అదీ ఓ ప్రైవేట్ జట్టుతో అని తెలిపారు.
కొన్నేళ్లుగా హెచ్సీఏ ప్రీమియం ప్రైవేట్ మార్కెట్ ప్లేస్ గా మారిపోయిందని దుయ్యబట్టారు. హెచ్సీఏలో అక్రమ, అర్హత లేని నియామకాలన్నంటిపై లీగల్ నోటీసులు పంపించనున్నట్టు చెప్పారు. గతంలో జమ్మూ కాశ్మీర్లో చేసినట్టుగానే హెచ్సీఏను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 14 నుంచి 36ఏళ్ల మధ్య వయసు ఉన్న ఆటగాళ్లకు 45డిగ్రీల ఎండలో ఓపెన్ సెలెక్షన్స్ నిర్వహించాలన్న హెచ్సీఏ నిర్ణయం జరుగనున్న మోసాన్ని తెలియచేస్తోందని చెప్పారు. ఇలాంటి ఇష్టారాజ్య నిర్ణయాలు, అక్రమ చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో టీసీఏ సలహాదారు గోపాల్ శర్మ, చిత్తరంజన్, వరుణ్ పాల్గొన్నారు.
Also Read: బండి బగీరథ్ కేసులో బిగ్ ట్విస్ట్.. బాధితురాలి తల్లి లేఖ వెనుక సంచలనాలు.. ఇరుకుంటున్న పెద్దలు