Fake Call Center: ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న ఫేక్ కాల్ సెంటర్ నెట్ వర్క్ ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఛేదించారు. స్పెషల్ ఆపరేషన్ జరిపి ముగ్గురు సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. కాల్ సెంటర్పై నిర్వహించిన దాడుల్లో 21 మంది తెలుగు మాట్లాడే మహిళా టెలీకాలర్లు, ఓ బ్యాంక్ ఖాతాదారున్ని అరెస్ట్ చేశారు. దీని వెనకున్న ముగ్గురు ప్రధాన నిర్వాహకులను గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారికోసం గాలిస్తున్నారు.
బ్యూరో డైరెక్టర్ శిఖా గొయల్ తెలిపిన వివరాల ప్రకారం.. లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ కలిసి ఢిల్లీలోని పీవీ మార్గ్ తోపాటు మరికొన్ని చోట్ల ఫేక్ కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసుండి తెలుగు అనర్గళంగా మాట్లాడే మహిళలను టెలీ కాలర్లుగా నియమించుకున్నారు. వీరిలో చాలామంది జగిత్యాల జిల్లా హైదరాబాద్లోని సైదాబాద్, బోడుప్పల్, మహబూబ్నగర్ జిల్లాకు చెందినవారు ఉన్నారు.
వీళ్లు బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులమని నమ్మించి ఆకర్షణీయమైన రుణ మంజూరు ఆఫర్లను చూపించి మోసాలకు పాల్పడ్డారు. ముందుగా సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతూ బాధితుల నుంచి బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారం సేకరించి వాటిని మోసాలకు ఉపయోగించారు. బాధితులు లావాదేవీల గురించి ప్రశ్నించినపుడు, డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినపుడు నిందితులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నెట్ వర్క్ గురించి పక్కా సమాచారం సేకరించిన బ్యూరో అధికారులు నిందితులను అరెస్ట్ చేశారు.
Also Read: ట్రైనీ ఐపీఎస్ కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి సీబీఐ మాజీ డైరెక్టర్.. సీఐడీ విచారణకు డిమాండ్!
రుణాలు ఇస్తామంటూ వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గొయల్ సూచించారు. ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్ చార్జీలు లేదా ఇతర ఏ మొత్తాన్నైనా చెల్లించే ముందు కాల్ చేసిన వ్యక్తి, రుణ సంస్థ నిజమైనదేనా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలని తెలిపారు. కాల్ చేసినవారు మహిళలు కావడం, తెలుగులో మాట్లాడటం వంటి అంశాలను మాత్రమే నమ్మి వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని హెచ్చరించారు. మోసం జరిగిందని అనుమానం వచ్చిన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని చెప్పారు.
Also Read: రాజకీయాల్లో ఎదిగిన రౌడీ… గెలిచిన రాత్రే హత్య.. అసలు చంపిందెవరు?