Farmer DISCOM: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ అన్నదాతల కష్టాలను తీర్చి, వ్యవసాయ రంగానికి మరింత నాణ్యమైన, నిరంతర విద్యుత్ను అందించాలనే సత్సంకల్పంతో ప్రభుత్వం తలపెట్టిన ‘రైతు డిస్కం’ ఆశయానికి తొలి అడుగులోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ, రైతులకు కానుకగా ఈ నూతన డిస్కంను అంకితం చేయాలని ప్రభుత్వం అహర్నిశలు శ్రమించినప్పటికీ, సాంకేతిక, అధికారిక అనుమతుల జాప్యం కారణంగా రైతు డిస్కం కార్యకలాపాలు ప్రారంభమయ్యేందుకు మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) నుంచి రావాల్సిన లైసెన్స్ ఇంకా జారీ కాకపోవడం వల్ల మరో ఒకట్రెండు వారాలు సమయం పట్టే చాన్స్ ఉందని తెలుస్తోంది.
తెలంగాణలో వ్యవసాయ విద్యుత్ సరఫరాను మరింత బలోపేతం చేసేందుకు, ఈ మెగా ప్రాజెక్టు కోసం రాత్రింబవళ్లు శ్రమించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నూతన డిస్కం సజావుగా సాగడం కోసం, రైతులకు తక్షణ సేవలు అందించేందుకు దాదాపు 2,000 మంది అనుభవజ్ఞులైన సిబ్బందిని కేటాయించేందుకు విధివిధానాలు కూడా సిద్ధమయ్యాయి. కానీ ఇటీవల విద్యుత్ నియంత్ర మండలిలో లైసెన్స్ మంజురుకు నిర్వహించి బహిరంగ విచారణలో రైతు డిస్కం ఏర్పాటును తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడం కూడా ఈ ఆలస్యానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
కొత్త డిస్కం ఏర్పాటుకు సాంకేతిక, న్యాయ పరమైన అంశాలతో పాటు ఆస్తుల విభజన, స్టాఫ్ నియామకం వంటి పలు అంశాలపై ఈఆర్సీ పూర్తిస్థాయిలో సమాలోచనలు చేసి తన తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది. అందుకు మరింత సమయం అవసరమని భావించడంతో ఆలస్యమవుతున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో రైతు డిస్కం 42 శాతం నెట్ వర్క్ ను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కానీ 42 శాతం స్టాఫ్ లేకుండా ఎలా అనే ప్రశ్నలు బహిరంగ విచారణలో లేవనెత్తారు. అంతేకాకుండా ఇప్పటికీ రైతు డిస్కం కార్యాలయం ఎస్పీడీసీఎల్ లో కేవలం 2000 చదరపు అడుగుల విస్తీర్ణం నుంచే ఇతర ప్రణాళికలు రచిస్తోంది.
Also Read: కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి
రైతు డిస్కం చట్టబద్ధంగా కార్యకలాపాలు ప్రారంభించాలంటే ఈఆర్సీ అనుమతి తప్పనిసరి. అయితే ఈ ప్రతిపాదనకు సంబంధించిన సాంకేతిక, న్యాయపరమైన అంశాల పరిశీలన ఇంకా ముగియకపోవడంతో లైసెన్స్ జారీ ప్రక్రియ పెండింగ్లో పడింది. దీనివల్ల ప్రభుత్వ ముందస్తు ప్రణాళికలన్నీ తలకిందులయ్యాయి. ఇకపోతే.. ప్రతిపక్షాలు రైతు డిస్కం ఏర్పాటును ముక్తం కంఠంతో వ్యతిరేకించాయి. అయితే తప్పని పరిస్థితుల్లో రైతు డిస్కం ఏర్పాటు చేయాల్సి వచ్చినా.. ఇంత ఆదరాబాదరాగా ఎందుకు చేయడమని నిలదీశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
దీనికి తోడు, రైతులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లతో కూడిన వేల కోట్ల రూపాయల ఆస్తుల విభజన ప్రక్రియపైనా ఇంకా కసరత్తు కొనసాగుతోంది. నెట్వర్క్ విభజన పనులు క్షేత్రస్థాయిలో ఆగిపోవడంతో, ప్రభుత్వంతో పాటు అటు రైతు లోకం కూడా తీవ్ర నిరాశకు గురవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు తీసుకొచ్చిన రైతు డిస్కంను తెలంగాణ ఆవిర్భావం రోజే ప్రారంభించడాన్ని సెంటిమెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. కానీ అలా జరగకపోవడంతో సర్కార్ నిర్ణయానికి దెబ్బగా మారింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ఈ బృహత్తర ప్రయత్నానికి ఈఆర్సీ త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, సాంకేతిక అడ్డంకులను తొలగిస్తుందని, తద్వారా రైతు డిస్కం త్వరలోనే సాకారం అవుతుందని విద్యుత్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Also read: కాకరేపుతున్న తెలంగాణ పాలిటిక్స్.. మళ్లీ ప్రాంతీయ బేస్లో పొలిటికల్ వార్..?