Telugu Communications: రాష్ట్రంలోని అన్నదాతలకు మరింత చేరువయ్యేందుకు, వారి సమస్యలను క్షేత్రస్థాయిలో వేగంగా పరిష్కరించేందుకు రైతు కమిషన్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కమిషన్ పరిధిలో జరిగే అధికారిక ఉత్తరప్రత్యుత్తరాల (కమ్యూనికేషన్స్) అన్నింటినీ ఇకపై పూర్తిగా తెలుగు భాషలోనే నిర్వహించాలని నిర్ణయించింది. రైతు కమిషన్ చైర్మన్ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రజల మాతృభాష తెలుగు కావడం, గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఇంగ్లీషు కంటే సొంత భాషలోనే విషయాలు సులభంగా అర్థమవుతాయనే ఉద్దేశంతోనే ఈ మార్పునకు శ్రీకారం చుట్టింది.
రాష్ట్రంలో ఏ కమిషన్ తీసుకొని నిర్ణయం తీసుకుంది. తెలుగులోనే కమిషన్ లేఖలు ఉండేలా విప్లవాత్మకంగా నిర్ణయం తీసుకుంది. రైతు కమిషన్ మరింత ప్రజాస్వామ్యీకరించే దిశగా, సామాన్య ప్రజలకు చేరువ చేయబోతుంది. కమిషన్ తీసుకునే నిర్ణయాలు, జారీ చేసే నివేదికలు, ఆదేశాలు ప్రతి సామాన్యుడికి, ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో ఉండే రైతులకు సైతం సులభంగా అర్థం కావాలనే ఉద్దేశంతోనే తెలుగులోనే ఉత్తర ప్రత్యూత్తరాలు జరపాలని అధికారులను ఆదేశించింది.
రాష్ట్రంలో మెజారిటీ జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తోంది. రైతు కమిషన్ వద్దకు వచ్చే అర్జీలు, ఫిర్యాదులు, వినతులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తుంటాయి. అయితే, వీటికి కమిషన్ అధికారులు ఇచ్చే ఆదేశాలు లేదా ప్రభుత్వ శాఖల మధ్య జరిగే సుదీర్ఘ ఉత్తరప్రత్యుత్తరాలు ఇంగ్లీషులో ఉండటం వల్ల సామాన్య రైతులకు అవి అర్థం కావడం లేదు. తమ సమస్యపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఈ గ్యాప్ను తొలగించేందుకు కమిషన్ చైర్మన్ మాతృభాషకే ప్రాధాన్యం ఇవ్వాలని నిశ్చయించారు.
Also read: పవన్ కళ్యాణ్ ‘OG 2’ గురించి అర్జున్ దాస్ షాకింగ్ కామెంట్స్..!
రైతు కమిషన్ కార్యకలాపాల్లో ఇంగ్లీషు భాష వాడకాన్ని దాదాపుగా తగ్గిస్తూ, కేవలం కేంద్ర ప్రభుత్వ శాఖలకు, జాతీయ స్థాయి సంస్థలకు రాసే లేఖలు, నివేదికలకు మాత్రమే ఇంగ్లీషును పరిమితం చేయనున్నారు. రాష్ట్ర పరిధిలోని వివిధ శాఖల అధికారులు, రైతులు, స్థానిక సంస్థలతో జరిపే సమాచార మార్పిడి అంతా నూటికి నూరు శాతం తెలుగులోనే ఉండాలని చైర్మన్ స్పష్టం చేశారు. రైతులకు సంబంధించిన జీవోలు, కమిషన్ సిఫార్సుల సారాంశాన్ని కూడా సరళమైన తెలుగులోకి అనువదించి అందుబాటులో ఉంచబోతున్నట్లు సమాచారం.
ఈ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయాలని కమిషన్లోని ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు చైర్మన్ ఖచ్చితమైన ఆదేశాలిచ్చారు. ఇప్పటివరకు కొనసాగుతున్న ఇంగ్లీషు అధికారిక పరిభాషను పక్కనపెట్టి, సామాన్యుడికి తెలిసేలా సరళమైన తెలుగు పదాలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగించాలని సూచించారు.రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి, మాతృభాషకు పట్టం కట్టాలనే సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే సామాన్య రైతులకు, తమకు సంబంధించిన ఫైళ్లలో ఏం రాశారో తెలియని పరిస్థితి ఇకపై ఉండబోదని, పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసుల్లో తెలుగు వెలుగులు నింపే ఈ ప్రక్రియ ఇతర శాఖలకు కూడా ఒక దిక్సూచిగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం, రైతులు, ప్రజల మధ్య వారధిగా మాతృభాషను ఉపయోగిస్తున్న రైతు కమిషన్ తీరు ఇతర సంస్థలకు సైతం ఆదర్శంగా నిలువబోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైతుల జీవన విధానం, వ్యవసాయ సమస్యలు, విధాన సూచనలు వంటి అంశాలను రైతుల భాషలోనే వివరించడం ద్వారా నివేదికలు మరింత ప్రభావవంతంగా మారనున్నాయి.
”మన రాష్ట్ర ప్రజల మాతృభాష తెలుగు. అన్నదాతల సమస్యలపై స్పందించే కమిషన్, వారికి అర్థం కాని భాషలో వ్యవహరిస్తే ప్రయోజనం లేదు. అందుకే ఫైలు కదలికల నుంచి ఆదేశాల దాకా అన్నీ తెలుగులోనే సాగాలని నిర్ణయించాం. రైతు కమిషన్ ఉద్దేశమే అన్నదాతకు అండగా నిలవడం. మన భాషలోనే వ్యవహారాలు సాగినప్పుడే ప్రభుత్వ నిర్ణయాలు ప్రతి సామాన్యుడికి నేరుగా అందుతాయి.ఇకపై కమిషన్ తీసుకునే ప్రతి నిర్ణయం సామాన్య రైతుకు సైతం స్పష్టంగా అర్థమయ్యేలా తెలుగులోనే ఉంటాయి. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, కమిషన్ పై రైతుల్లో నమ్మకం మరింత పెరుగుతుంది”
Also read: Fake Doctor: సంతాన లేమితో బాధపడుతున్నారా.. మేడ్చల్లో నకిలీ వైద్యుడు కలకలం