Addanki Dayakar: తెలంగాణ అవతరణ దినోత్సవం వేళ రాజకీయాలు వేడెక్కాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన సభకు అనుమతి నిరాకరణ, బీజేపీ వ్యూహాలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పవన్ కళ్యాణ్ ఒక పావు మాత్రమే
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ ‘నవ నిర్మాణ సభ’ పెట్టాలనుకోవడం, దానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై దయాకర్ స్పందించారు. పవన్కు రాజకీయం తెలియదని, ఆయన్ను బీజేపీ తన స్వార్థం కోసం వాడుకుంటోందని విమర్శించారు. ఒకప్పుడు చేగువేరా వారసుడినని చెప్పుకున్న పవన్, ఇప్పుడు బీజేపీ స్క్రిప్ట్ ప్రకారం హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటూ తిరగడం ఏంటని ప్రశ్నించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు పెంచే కుట్రలకు తెరలేపవద్దని హితవు పలికారు.
తెలంగాణ సెంటిమెంట్తో BRSకు లబ్ధి?
బీజేపీ ఆడుతున్న ఈ రాజకీయ నాటకం వెనుక పెద్ద వ్యూహం ఉందన్నది దయాకర్ ఆరోపణ. పవన్ కళ్యాణ్ను తెలంగాణ మీదికి ఉసిగొల్పి, మళ్లీ ఇక్కడ ప్రాంతీయ సెంటిమెంట్ను రాజేయాలని బీజేపీ చూస్తోందన్నారు. దీనివల్ల కనుమరుగవుతున్న BRS పార్టీకి మళ్లీ అనుకూల వాతావరణం కల్పించి, దాన్ని పెద్ద చేయాలనేదే బీజేపీ ప్లాన్ అని విమర్శించారు. తెలంగాణపై నిలువెల్లా విషం చిమ్మే బీజేపీ, ఇక్కడి ప్రజల మధ్య ప్రశాంతత లేకుండా చేయాలని చూస్తోందని మండిపడ్డారు.
కేసీఆర్, కేటీఆర్ మౌనం ఎందుకు?
తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి జరుగుతుంటే BRS నేతలు ఎందుకు నోరు విప్పడం లేదని దయాకర్ నిలదీశారు. కేసీఆర్ ఫామ్హౌస్కే పరిమితమయ్యారని, నిత్యం మైకుల ముందు మాట్లాడే కేటీఆర్ ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని అడిగారు. గతంలో పవన్ కొండగట్టు, వారాహి యాత్రలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చి గౌరవించిందని గుర్తుచేశారు.
శాంతి భద్రతలే ముఖ్యం
తెలంగాణ ఎందరో అమరవీరుల త్యాగాలు, తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి సాధించుకున్న ఉద్యమ గడ్డ అని దయాకర్ స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు పచ్చగా ఉండాలనేదే కాంగ్రెస్ ఆకాంక్ష అని, కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి సఖ్యతగా ఉంటోంది కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమేనని తెలిపారు. పొరుగు రాష్ట్రంలో అధికారం దక్కింది కదా అని ఇక్కడ చిచ్చు పెట్టాలని చూస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని హెచ్చరించారు.
Also Read: హైదరాబాద్ మెట్రోలో బరితెగించిన యువకుడు.. సీటుపై కాళ్లు పెట్టి రచ్చ రచ్చ!