తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్.. ఆంధ్ర పాలకులు తెలంగాణ వనరులపై కన్నేశారని హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన టీజేఎస్ పార్టీలో రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ మధ్యకాలంలో ఆంధ్ర, తెలంగాణలో జరిగిన రాజకీయ సమీకరణలు, పరిణామాల పట్ల ఆయన తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణ వనరులపై కన్నేసి.. ఇక్కడి రాజకీయాల్లో పెత్తనం కోసం ఆంధ్ర పాలకులు ట్రై చేస్తున్నారని, దీనికి కేంద్ర ప్రభుత్వం సపోర్టుగా ఉందని ఆయన సంచలన కామెంట్స్ చేశారు.
పరోక్షంగా ఆయన పవన్ కళ్యాణ్ అంశాన్ని కూడా లేవనెత్తారు. నాగేశ్వర్ విషయంలో పవన్ వ్యవహరించిన తీరు, చంద్రబాబు సపోర్టు చేసిన వైనాన్ని అన్నింటినీ ఆయన ఖండించారు. తాజాగా సభలు, సమావేశాల పేరుతో ఇక్కడ తిష్టవేసి, ఇక్కడి రాజకీయాలను కలుషితం చేయడం ద్వారా మళ్లీ తెలంగాణలో ఆంధ్ర పెత్తనం సాగేలా చేసుకోవాలనేది ఆంధ్ర పాలకుల వ్యూహంగా ఉందని, అందుకే ఈ కుట్రలు పన్నుతున్నారని ఆయన స్పష్టం చేశారు. పవన్ ఇక్కడ మీటింగు పేరుతో రాజకీయ ప్రకంపనలు సృష్టించేందుకు పూనుకోవడం.. ఆ తరువాత అనుమతి లేదన్నా.. ప్రెస్మీటైనా పెట్టుకుంటామని దీన్ని కూడా వైరల్ చేసుకుని.. ఎక్కువ ప్రచారం చేసుకోవడం ద్వారా ఇక్కడి రాజకీయాల్లో తన పార్టీని, తద్వారా బీజేపీని బలోపేతం చేయాలనే వ్యూహం దాగుందని ఆయన కుండబద్దలు కొట్టారు.
అంతేకాదు.. పవన్ వెనుక, ఆయన తెలంగాణ విషయంలో చూపిస్తున్న అతి చొరవ, కయ్యానికి కాలు దువ్వే తత్వం వెనుక ప్రధాని మోడీ ఉన్నారని కోదండరామ్ వ్యాఖ్యానించడం.. కలకలం రేపుతోంది. బీజేపీ ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్నదని, ఇక్కడి తెలంగాణ నేతల మధ్య సమన్వయం లేకపోవడం, పార్టీ ఎదగకపోవడం.. ప్రజలు విశ్వసించకపోవడం.. ఇవన్నీ కారణాల రీత్యా ఆంధ్ర పాలకులను మోడీ నమ్ముకున్నారనే అర్థం వచ్చేలా కోదండరామ్ కామెంట్స్ను బట్టి అర్థమవుతోంది. కేసీఆర్ పాలనలో ఉన్నంత నియంతృత్వం ఇప్పుడు లేదని, అప్పుడు కేసీఆర్ కుటుంబమే ఓ ప్రభుత్వంలా నియంతృత్వ పాలన కొనసాగిందని అన్నారు.
పవన్ .. సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టడం పట్ల ఆయన ఈ విధంగా స్పందించారు. ఎవరైనా రావొచ్చు.. సభలు పెట్టుకోవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా, విధ్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూడటమే తప్పని.. ఈ రాజకీయ వ్యూహంలో కేంద్రం భాగస్వామ్యమైందని కోదండరామ్ స్పష్టం చేశారు. తెలంగాణ జనం అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.