School Breakfast: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని అందించనుంది. కాగా బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని రెండు ప్రముఖ స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజన బాధ్యతలను మహిళా సంఘాలే కొనసాగించనున్నాయి. బ్రేక్ ఫాస్ట్ పథకం నిర్వహణను ప్రభుత్వం భౌగోళికంగా విభజించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని పాఠశాలల్లో అల్పాహార పంపిణీ బాధ్యతలను మన్నార్ ట్రస్ట్కు అప్పగించాలని భావిస్తోంది. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఈ పథకాన్ని అక్షయపాత్ర ఫౌండేషన్ పర్యవేక్షించనుంది. ఇకపోతే.. చాలా కాలంగా కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయలేదు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే బాధ్యతను యథావిధిగా మహిళా స్వయం సహాయక సంఘాలకే అప్పగించారు. దీనివల్ల స్థానిక మహిళలకు ఉపాధి కొనసాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా మొత్తం రూ.1,269 కోట్ల అంచనాతో మూడు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. విద్యార్థులకు అల్పాహారం, పాలు అందించేందుకు రూ.720 కోట్లు సర్కార్ బడ్జెట్ లో కేటాయించింది. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయింపులు చేసింది. అంగన్వాడీ స్థాయిలోనే విద్యా పునాదిని బలోపేతం చేసేందుకు రూ.49 కోట్లు కేటాయించారు. ఇదిలా ఉండగా రూ.720 కోట్లలో బ్రేక్ ఫాస్ట్ కు రూ.540 కోట్లు, పాల కోసం రూ.180 కోట్లు ఖర్చు చేయనున్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి దాదాపు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు దీని ద్వారా ప్రయోజనం పొందనున్నారు. ఈ నిర్ణయాల ద్వారా విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని గణనీయంగా పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రభుత్వ శిక్షణతో విదేశాల్లో ఉద్యోగాలు..!
ఇదిలా ఉండగా ఈ పథకాల నిర్వహణ వ్యయంలో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం కంటే, ఉదయం అందించే అల్పాహారం తయారీ ఖర్చే అధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మధ్యాహ్న భోజన ఫుడ్ కాస్ట్ కంటే అల్పాహారం ఫుడ్ కాస్ట్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ధరల వ్యత్యాసంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. మధ్యాహ్న భోజనం కోసం 5వ తరగతి లోపున్న విద్యార్థులకు రూ.6.78 గా ధర నిర్ణయించారు. ఇక 6-12వ తరగతి వరకు గల విద్యార్థులకు రూ.10.17 ఇస్తున్నారు. అదే బ్రేక్ ఫాస్ట్ కు వచ్చేసరికి 5వ తరగతిలోపు విద్యార్థులకు రూ.11.50 గా ఉంటే.., 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గల విద్యార్థులకు రూ.13.50 చొప్పున ఇచ్చేందుకు ఖరారుచేశారు. ప్రాథమిక తరగతుల్లో రూ.5, ఉన్నత పాఠశాలల్లో రూ.2 చొప్పున బ్రేక్ఫాస్ట్ కంటే భోజనానికి తక్కువగా ఉండటం గమనార్హం.
Also read: సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్.. ప్రజా పాలనలో నయా విప్లవం..!