Gurukul Grievances: స్వేచ్ఛ బ్యూరో: జిల్లా స్థాయిలోనే గురుకుల విద్యాలయాలు,వసతి గృహాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ఎక్స్ క్లూజీవ్ గా జిల్లా కలెక్టరేట్లలోనే గ్రీవెన్స్ సెల్స్ ఏర్పాటుచేయాలని తాజాగా సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు చిన్న చిన్న అవసరాలకు,గ్రివెన్స్ పరిష్కారానికి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయాల చుట్టూ ఉద్యోగులు తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సర్కార్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇక తిరగాల్సిన పరిస్థితికి చెక్ పెట్టేందుకు సరికొత్త యంత్రాంగం రూపుదిద్దుకుంటోంది. సమస్య ఏదైనా..ఇకపై జిల్లాల్లోనే, కలెక్టర్ల ఆధ్వర్యంలోనే పరిష్కారం అయ్యేలా ప్రభుత్వం చొరవ చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
సాధారణంగా గురుకులాల్లో పనిచేసే ఉపాధ్యాయులు, వార్డెన్లు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బందికి బదిలీలు, ప్రమోషన్లు, జీతభత్యాల ఇబ్బందులు, మెడికల్ లీవ్లు, స్థానిక వసతుల కొరత వంటి ఏ సమస్య వచ్చినా.. హైదరాబాద్లోని సొసైటీ హెడ్ ఆఫీసుల చుట్టూ తిరగడం ఒక ఆనవాయితీగా మారింది.దీని వలన సమయం వృథాతో పాటు గురుకులాల్లోని వర్క్స్ డీలే అవుతున్నాయి. అంతేగాక ఉద్యోగులపై పనిఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఉద్యోగులు హైదరాబాద్ వరకు వచ్చే అవసరం లేకుండా, వారి సమయం, డబ్బు వృథా కాకుండా స్థానిక జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గ్రివెన్స్ సెల్స్ ఏర్పాటు చేసి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించనున్నారు.
Also read: చిరంజీవి-విజయ్ ఫోన్ కాల్.. ఆ ఒక్క మాటతో కోలీవుడ్లో పెరిగిన జోష్!
సమస్యల పరిష్కరానికి ఉపాధ్యాయులు, గురుకుల స్టాఫ్ ప్రధాన కార్యాలయాల చుట్టూ తిరగడం వలన విద్యార్ధులకు బోధించడంలోనూ సమస్యలు వస్తున్నాయి. స్కూళ్లలోచిన్న రిపేర్లు, సిబ్బంది సర్దుబాటు, టెక్నికల్ సమస్యలు వంటి అంశాల కోసం కూడా హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉద్యోగులు ఒత్తిడికి లోనవుతున్నారు. ఇక జిల్లాల నుంచి వచ్చే సిబ్బంది సెలవులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలో గురుకులాలు నిర్వహణలో ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సర్కార్ కొత్త నిర్ణయం తీసుకున్నది. త్వరలోనే అమల్లోకి రానున్నట్లు సెక్రటేరియట్ లోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. జిల్లాల్లోనే సమస్యలు పరిష్కారం అయితే 24 గంటలూ విద్యార్థుల సంరక్షణ, చదువుపై ఉపాధ్యాయులు, సిబ్బంది శ్రద్ధ పెట్టే ఛాన్స్ ఉంటుంది.
అడ్మినిస్ట్రేషన్ తో పాటు గురుకులాల నిర్వహణలో ఎలాంటి సమస్యలు వచ్చినా, కలెక్టర్లు మానిటరింగ్ చేయడం వలన వేగంగా పరిష్కారం లభించే ఛాన్స్ ఉంటుంది.ముఖ్యమైన ఫైళ్ల కదలిక హెడ్ ఆఫీస్ దాకా వెళ్లి, నెలల తరబడి ఆలస్యం అయ్యే దాని కంటే జిల్లా స్థాయిలోనే కలెక్టర్ సమీక్ష నిర్వహించడం వలన త్వరితగతిన క్లియరెన్స్ అయ్యే అవకాశం ఉన్నది. అంతేగాక స్కూళ్లలో స్టాఫ్ కొరత రాదు. అదనపు ప్రయాణాలు, పనిఒత్తిడి వంటివి ఉండవు.జిల్లా కలెక్టర్లకు గురుకులాల గ్రివెన్స్ బాధ్యతలు పూర్తిగా అప్పగిస్తే, స్థానిక నిధుల విడుదల, మౌలిక వసతుల కల్పన,సిబ్బంది అంతర్గత సమస్యల పరిష్కారం చాలా వేగంగా జరుగుతుందని విద్యా రంగా నిపుణులు భావిస్తున్నారు. కలెక్టర్ల పర్యవేక్షణ పెరిగితే క్షేత్రస్థాయిలో జవాబుదారీతనం పెరుగుతుంది.అలాగే ఉన్నతాధికారుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయని ఉద్యోగులు చెప్తున్నారు.
Also read: కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవి ఊడుతుందా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ వెనుక పెద్ద తలకాయలు?