Telangana Govt: రేషన్ కార్డు దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త. రేషన్ కార్డుల లబ్ధిదారులకు సన్న బియ్యం ఇచ్చేందుకు రేవంత్ ప్రభుత్వం రెడీ అయ్యింది. ఉగాది నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. అంతా అనుకున్నట్టు జరిగితే సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం లబ్దిదారులకు ఇస్తున్నారు. చాలా మంది నిరుపేదలు వాటినే తింటున్నారు. పండగలు లేదా బంధువులు వచ్చినప్పుడు సన్నబియ్యం కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో సన్న బియ్యం కేజీ రూ. 50 నుంచి రూ.75 మధ్య పలుకుతోంది. అంత డబ్బు పెట్టి కొనకుండా రేషన్ కార్డులపై ఉచితంగా సన్నబియ్యం ఇవ్వనుంది ప్రభుత్వం.
ఒక్కో సభ్యుడికి 6 కేజీల చొప్పున ఎంతమంది ఉంటే అన్ని ఆరు కిలోలు సన్న బియ్యాన్ని ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఏప్రిల్ ఒకటి నుంచి ఇవ్వాలని భావిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ వర్గాలు వెల్లడించాయి. గోదాముల్లో సన్నబియ్యం సిద్ధంగా ఉన్నట్లు అధికార అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిల్వ ఉన్న బియ్యం రానున్న 4 నెలల కాలానికి నెలలకు సరిపోతాయని అంచనా వేస్తున్నారు.
రేషన్కార్డు దారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్న బియ్యం తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 91,19,268 రేషన్ కార్డులు ఉన్నారు. 2,82,77,859 మంది లబ్ధిదారులు ఉన్నారు. కొద్దిరోజుల కిందట కొత్త రేషన్ కార్డులు పంపిణీని అంతా సిద్ధం చేశారు. వారికీ సన్న బియ్యం అందనుంది. కోటి 10 లక్షల మంది రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది రేవంత్ సర్కార్.
ALSO READ: ఎమ్మెల్యే రాజాసింగ్ను అలర్ట్ చేసిన పోలీసులు
ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి పౌర సరఫరాల శాఖ దాదాపు 53.95 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన వడ్లను మిల్లర్లకు అందజేశారు. అక్కడ కస్టమ్ మిల్లింగ్ రైస్ చేసి వాటిని గోదాముల్లో నిల్వ చేశారు. గతంలో కంటే ఈసారి కొనుగోలు కేంద్రాలకు సన్న వడ్లు అధికంగా వచ్చాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. సన్న, దొడ్డు వడ్లను వేర్వేరుగా నిల్వ చేసిన అధికారులు వాటిని మిల్లింగ్ చేయించారు.