Telangana Electricity: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని కోట్లాది మంది విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీలను పెంచకూడదని ప్రభుత్వం భావిస్తోంది. డిస్కంల ఆర్థిక లోటు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించడంతో పెంపు ప్రతిపాదనలు ఉండబోవని తెలుస్తోంది. గతంలోనే డిస్కంలు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్ మెంట్(ఏఆర్ఆర్) ను సమర్పించాయి. కాగా గురువారం శుక్రవారం ఎన్పీడీసీఎల్ బహిరంగ విచారణ జరిగింది. శనివారం ఎస్పీడీసీఎల్ పరిధిలో చార్జీల పెంపు ప్రతిపాదనలపై బహిరంగ విచారణ కొనసాగనుంది.
ఎస్పీడీసీఎల్ 2026-27 సంవత్సరానికి గాను రూ.50153 కోట్లు అవసరమవుతాయని ఏఆర్ఆర్ సమర్పించింది. అయితే అందులో ప్రస్తుత టారిఫ్ ల ద్వారా రూ.40,378 కోట్లు వస్తుండగా క్రాస్ సబ్సిడీ సర్ చార్జ్, అడిషనల్ సర్ చార్జ్ ద్వారా రూ.198 కోట్లు, నాన్ టారిఫ్ ఇన్ కం ద్వారా రూ.83 కోట్లు సమకూరుతున్నట్లుగా పేర్కొంది. కాగా రూ.9,494 కోట్లు లోటు బడ్జెట్ లో ఉన్నట్లుగా పేర్కొంది. అలాగే ఎన్పీడీసీఎల్ 2026-27 సంవత్సరానికి గాను రూ.22,754 కోట్లు అవసరమవుతాయని విద్యుత్ నియంత్రణ మండలికి ఏఆర్ఆర్ సమర్పించింది. కాగా ప్రస్తుత టారిఫ్ ల ద్వారా రూ.10,233 కోట్లు సమకూరుతున్నట్లుగా చెప్పింది. మిగతా రూ.12,521 కోట్ల ఆదాయ లోటును ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది.
విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) ఎదుర్కొంటున్న భారీ ఆదాయ లోటును సామాన్యులపై రుద్దకుండా, ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. సబ్సిడీల రూపంలో ఈ మొత్తాన్ని డిస్కంలకు చెల్లించడం ద్వారా వినియోగదారులకు పాత ధరలకే విద్యుత్ అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని రెండు ప్రధాన డిస్కంలు(ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్) తమ ఆదాయం, వ్యయాల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించాయి. మొత్తం మీద డిస్కంల రెవెన్యూ గ్యాప్ రూ.22,015 కోట్లుగా అంచనా వేశారు. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) సుమారు రూ.9,494 కోట్ల లోటును ఎదుర్కొంటోంది. ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) ఏకంగా రూ.12,521 కోట్ల మేర ఆదాయ లోటు ఎదుర్కొంటోంది. కాగా ఈ గ్యాప్ ను రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు సిద్ధమవుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.
Also Read: Epic First Note: సంచారమే సాంగ్ ప్రోమో వచ్చింది.. స్పెషల్ ఏంటంటే?
విద్యుత్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్-సబ్సిడీ-సర్ చార్జీల ప్రతిపాదనలపై శనివారం తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ చేపట్టనుంది. హైదరాబాద్ లోని విద్యుత్ నియంత్రణ భవన్ లో ఎస్పీడీసీఎల్ ఆదాయ అవసరాలపై ఈ విచారణ కొనసాగనుంది. వినియోగదారులు, వివిధ సంఘాల ప్రతినిధులు తమ అభ్యంతరాలను, సూచనలను ఈ విచారణలో నేరుగా వెల్లడించవచ్చు. ఈ విచారణల అనంతరం టీజీఈఆర్సీ తుది టారిఫ్ ఆదేశాలను రిలీజ్ చేయనుంది.
ఏఆర్ఆర్ 50,153
కరెంట్ టారిఫ్స్ ద్వారా సమకూరేవి 40,378
క్రాస్ సబ్సిడీ, అడిషనల్ సర్ చార్జీల ద్వారా వచ్చేవి 198
నాన్ టారిఫ్ ద్వారా సమకూరేవి 83
రెవెన్యూ గ్యాప్ 9,494
ఏఆర్ఆర్ 22,754
కరెంట్ టారిఫ్స్ ద్వారా సమకూరేవి 10,233
రెవెన్యూ గ్యాప్ 12,521