ABAS System: రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తప్పనిసరిగా ఆబాస్(ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్) ను అమలు చేయాలని సర్కార్ ఆదేశాలిచ్చింది. అన్ని జిల్లాల్లో ఈ రూల్ ను వెంటనే అమలు చేయాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ బీ రవీంద్రనాయక్ ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చారు. ఖచ్చితంగా ఆబాస్ ను ఇంప్లిమెంట్ చేయాలని సూచించారు. హెచ్ వోడీలంతా ఆబాస్ అమలు తీరును పరిశీలించి తన కార్యాలయానికి నివేదిక పంపించాలన్నారు. ఉద్యోగుల వివరాలను కూడా సాప్ట్ వేర్ లో ఎంట్రీ చేయాలని, పీహెచ్ సీల్లో కొత్తగా చేరిన స్టాఫ్ కూ ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చేయాలని కోరారు. ఇటీవల ప్రభుత్వం వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఓ కీలక రివ్యూ నిర్వహించింది. ఉద్యోగుల అటెండెన్స్ ను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని ఉన్నతాధికారులు ఈ రివ్యూలో సూచించారు. దీంతో పీహెచ్ సీల్లో వంద శాతం ఆబాస్ అమలయ్యేందుకు వైద్యారోగ్యశాఖ చర్యలు తీసుకుంటున్నది. డైలీ వైజ్ మానిటరింగ్ చేస్తూనే, ప్రతీ నెల ఆబాస్ ను వివరాలను డీఎమ్ హెచ్ వోలకు అందచేయాల్సి ఉంటుంది. ఆబాస్ ను అమలు చేయకపోతే హెచ్ వోడీలపై కూడా చర్యలు తీసుకోనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 800 పీహెచ్ సీల్లో ఈ ఆబాస్ విధానాన్ని అమలు చేయనున్నారు. దీని వలన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆలస్యంగా వచ్చే వైద్యులు, స్టాఫ్ ను సులువుగా గుర్తించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. అంతేగాక డ్యూటీలకు డుమ్మా కొట్టే వారిని కూడా ఈజీగా పసిగట్టవచ్చని వైద్యారోగ్యశాఖ చెబుతున్నది. వాస్తవానికి గతంలోనే సీసీ కెమెరాల మానిటరింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. కోఠి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ కూడా ఉన్నది. ఉన్నతాధికారులు పట్టించుకోకవడం, పీహెచ్ సీల్లో సీసీ కెమెరాలు పనిచేయడం పోవడంతో ఉద్యోగులపై నిఘా లేదు. ఇప్పుడు ఆబాస్ విధానం తీసుకువచ్చినప్పటికీ, సరైన పర్యావేక్షణ లేకుంటే ఆశించిన ఫలితాలు ఉండవని కొందరు డాక్టర్లే చెప్తున్నారు.
Also Read: Shooting at School: పాఠశాలలో కాల్పులు.. 10 మంది మృతి, కెనడాలో దారుణం
రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ విభాగంలో కొందరు డాక్టర్లు విధులకు ఆలస్యంగా హజరవుతున్నట్లు సర్కార్ కు ఫిర్యాదులు అందాయి. అంతేగాక ఉదయం వచ్చి గంట సేపు తర్వాత తిరిగి ప్రైవేట్, సొంత క్లినిక్ లకు వెళిపోతున్నట్లు గుర్తించింది. దీంతో ఎంతో మంది పేదలకు సకాలంలో వైద్యం అందడం లేదు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నది. దీనికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అంతేగాక ఓపీ సమయంలో కేవలం స్టాఫ్ నర్సు మాత్రమే పేషెంట్లను చూస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్లు క్యాబీన్ల నుంచి బయటకు రావడం లేదని మరి కొన్ని పీహెచ్ సీలపై ఫిర్యాదులు ఉన్నాయి. ఇటీవల పలువురు ఎంఎల్ఏలు కూడా ప్రభుత్వానికి కంప్లెంట్ఇచ్చినట్లు తెలిసింది.దీంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
Also Read: Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండిసంజయ్ ఫైర్..!