Indiramma Housing: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో క్యూర్(కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో నివసించే పేద ప్రజల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా స్థలాలను గుర్తించాలని సూచించారు. హైదరాబాద్ సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ తో కలిసి క్యూర్ ఏరియాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, డబుల్ బెడ్ రూం ఇండ్లపై సోమవారం సమీక్ష నిర్వహించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు, అలాగే డబుల్ బెడ్రూం ఇండ్లకు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉండాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
డబుల్ బెడ్రూం ఇండ్లు పొంది వాటిలో నివసించకుండా అద్దెకు ఇస్తున్నవారికి, ఏండ్ల తరబడి తాళాలు వేసి ఖాళీగా ఉంచుతున్న వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. నోటీసులకు స్పందించని వారి ఇండ్లను రద్దు చేసి అర్హులైన పేదలకు కేటాయించాలని స్పష్టంచేశారు. ఇప్పటి వరకు ఎంతమందికి నోటీసులు ఇచ్చారని, ఎంతమంది స్పందించారని, అక్కడ నివాసం ఉండకపోవడానికి వారు చెప్పిన కారణాలేంటని మంత్రి ఆరా తీశారు. 2 బీహెచ్కే, జేఎన్ఆర్ఎం తదితర పథకాల్లో ఇండ్లు పొంది నివాసం ఉండని ఇండ్లను మే 1వ తేదీ నుంచి పరిశీలించాలని, నోటీసులు ఇచ్చి, స్పందించకుంటే కేటాయింపులను రద్దు చేయాలని స్పష్టం చేశారు. నోటీసులపై స్పందించిన లబ్ధిదారుల నుంచి బాండ్ పేపర్ పై తాము ఇక్కడే నివాసం ఉంటామని, లేదంటే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు వారి నుంచి హామీ పొందాలని మంత్రి పొంగులేటి సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు ఆమోదం తెలిపేలా అండర్ టేకింగ్ తీసుకోవాలని సూచించారు.
Also Read: MLA Committees: శాసనసభలో సరికొత్త వ్యూహం.. ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు..?
నాలుగు జిల్లాల పరిధిలోగల కాలనీల్లో ముఖ్యంగా విద్యుత్, తాగునీరు, డ్రైనేజ్ వంటి కనీస వసతులను తప్పనిసరిగా కల్పించాలని, ఈ విషయంలో జీహెచ్ఎంసీ సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా 22 వేల ఇండ్లకు విద్యుత్ మీటర్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటుచేయాలని మంత్రి ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం టవర్లు మొత్తం పూర్తయ్యేవరకు ఆగకుండా పూర్తయిన వాటిని ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు కేటాయించాలన్నారు. అదేవిధంగా వివిధ కాలనీల్లో ఉన్న వాణిజ్య సముదాయాలను అద్దె ప్రాతిపదకన కాకుండా వేలం పద్ధతిలో వాటిని విక్రయించాలని, ఆవిధంగా వచ్చిన డబ్బును అక్కడి సొసైటీ, ప్రభుత్వం పేరిట జాయింట్ అకౌంట్ లో వేయాలన్నారు. అంతేగాక ప్రజా ప్రయోజన కార్యాలయాల కోసం కూడా కొన్నింటిని కేటాయించాలని తెలిపారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి, ఎండీ వీపీ గౌతమ్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read: Farmer Kits: రైతులకు శుభవార్త.. రాష్ట్రంలో నేడు ఫార్మర్ కిట్స్ పంపిణీ..!